వాడి నిశ్శబ్దం ప్రమాదం.. వదలడు

Idam Jagath trailer released - Sakshi

‘‘ఒక రిపోర్టర్‌ సైలెంట్‌గా ఉన్నాడంటే దాని అర్థం వాడు మనకి చాలా దగ్గరగా వచ్చేశాడని.. వాడి నిశ్శబ్దం ప్రమాదం.. వదలడు, పాపకి ఏమైనా అయ్యుంటే.. నేనున్నాను కదా సార్, మరీ అంత డేంజరస్‌గా ఉన్నావేంట్రా’’ వంటి డైలాగులు ‘ఇదం జగత్‌’ చిత్రం ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి. సుమంత్, అంజు కురియన్‌ జంటగా అనీల్‌ శ్రీ కంఠం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇదం జగత్‌’. విరాట్‌ ఫిల్మ్స్‌ అండ్‌ శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమాస్‌ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. సినిమా ట్రైలర్‌ని అడవి శేష్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను బయటకు వచ్చి మాట్లాడే రకం కాదు. ‘ఇదం జగత్‌’ సినిమా చూడలేదు. కానీ నచ్చిన పాయింట్‌ అనిపిస్తేనే ఇలా మాట్లాడతాను.

నాకు సినిమాటోగ్రఫీలో బొకే షాట్స్‌ ఇష్టం. అలాంటి షాట్స్, కథ ఈ సినిమా నాకు నచ్చడానికి కారణం’’ అన్నారు. ‘‘సుమంత్‌గారి కెరీర్‌లో ఇది డిఫరెంట్‌ మూవీ. అందరి కృషి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది’’ అని పద్మావతి అన్నారు. ‘‘సుమంత్‌గారు రాత్రి, పగలు అని తేడా లేకుండా ఈ సినిమా షూటింగ్‌ చేశారు’’ అన్నారు శ్రీధర్‌. ‘‘కె మెరా, మ్యూజిక్, ఎడిటింగ్‌.. లాంటి అన్ని శాఖలు కలిస్తేనే ఈ సినిమా ఇలా బాగా వచ్చింది’’ అన్నారు అనిల్‌. ‘‘నన్ను అంతా ‘గోదావరి’ చిత్రంలో బోటు మీద శ్రీరామ చంద్రుడు క్యారెక్టర్‌లోనే ఉన్నాను అనుకుంటున్నారు. అది నిజం కాదు. థ్రిల్లర్‌ కథలంటే మొదట ఆసక్తి ఉండేది కాదు. నా మిత్రుడు అడవి శేష్‌ నటించిన ‘క్షణం, గూఢచారి’ వంటి థ్రిల్లర్స్‌   నాలో మార్పు తెచ్చాయి’’ అన్నారు సుమంత్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top