
హాలీవుడ్ రీమేక్స్ అక్కడి కథ... ఇక్కడి తెరపై!
ప్రపంచంలో పన్నెండు కథలే ఉంటాయట. ఏ సినిమా అయినా ప్రాథమికమైన ఆ కథల నుంచి మార్పులు, చేర్పులతో తయారవుతుందని
ప్రపంచంలో పన్నెండు కథలే ఉంటాయట. ఏ సినిమా అయినా ప్రాథమికమైన ఆ కథల నుంచి మార్పులు, చేర్పులతో తయారవుతుందని సినీ పండితుల విశ్లేషణ. ఆ మాట అలా ఉంచితే, మన సినిమాల్లో చాలా వాటికి అమెరికా నుంచి కొరియా, జపాన్ దాకా అనేక దేశాల విదేశీ సినిమాలు స్ఫూర్తి అన్నది తరచూ వింటూనే ఉంటాం. చాలావరకు కాపీరైట్ తీసుకోకుండానే తెర కెక్కిన ఫ్రీమేక్లైతే, కొన్ని మాత్రం రీమేక్లు. అయితే, తాజాగా మన బాలీవుడ్ దర్శక, నిర్మాతలు కొందరు ‘ఫలానా హాలీవుడ్ సినిమాకు మాది రీమేక్’ అంటూ రైట్స్ తీసుకొని మరీ ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం తెర మీదకొ స్తున్న అలాంటి విదేశీ చిత్రాల స్వదేశీ రీమేక్లలో కొన్నిటి గురించి...
అక్కడ గెలవని ‘వారియర్’... ఇక్కడ గెలుస్తాడా?
అక్షయ్కుమార్, సిద్ధార్థ మల్హోత్రాలు బాక్సింగ్ రింగ్లో హోరాహోరీగా తలపడుతున్న దృశ్యాలు యూట్యూబ్లో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అవి హిందీ చిత్రం ‘బ్రదర్స్’కి సంబంధించిన ప్రచార చిత్రంలోని సన్నివేశాలు. అన్నదమ్ముల మధ్య సాగే కథగా తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ‘వారియర్’ దీనికి ఆధారం. గెవిన్ ఒ కానర్ దర్శకత్వంలో రూపొందిన ఆ హాలీవుడ్ చిత్రం కమర్షియల్గా విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ హాలీవుడ్ సినిమా ప్రేరణతో దర్శకుడు కరణ్ మల్హోత్రా ఈ ‘బ్రదర్స్’ చిత్రం తీస్తున్నారు. గతంలో హృతిక్ రోషన్తో ‘అగ్నిపథ్’ తెరకెక్కించిన కరణ్ మల్హోత్రా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందిస్తున్నారు.
హాలీవుడ్ మాతృక ‘వారియర్’లో అత్యంత సహజంగా చిత్రీకరించిన పోరాట సన్నివేశాలకు బాగా పేరొచ్చింది. అందుకే, మాతృకకు ఏ మాత్రం తీసిపోని విధంగా ‘బ్రదర్స్’లో స్టంట్స్ డిజైన్ చేయాలని కరణ్ భావించారు. అందుకని ఏకంగా హాలీవుడ్ ‘వారియర్’కి పనిచేసిన స్టంట్ మాస్టర్స్నే ఇక్కడా రంగంలోకి దింపారు. కాగా, మాతృక కోసం తాము చేసిన యాక్షన్ పార్ట్ కన్నా, ‘బ్రదర్స్ ’లోని పోరాట సన్నివేశాలే బాగా వచ్చాయని ఈ హాలీవుడ్ నిపుణులు తెలిపారు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. హాలీవుడ్లో ఫర్వాలేదనిపించుకున్న ‘వారియర్’ ఇక్కడ ‘బ్రదర్స్’గా సత్తా చూపిస్తుందా, లేదా అన్నది తెలియాలంటే ఆగస్టు 14 వరకు ఆగాల్సిందే.
ఈ థ్రిల్లర్ క్లిక్ అవుతుందా?
పదేళ్ల పాటు కోమాలో ఉన్న ఓ యువతికి స్పృహ వస్తుంది. ఆమెకు అంతా కొత్తగా అనిపిస్తోంది. అప్పటికే పెళ్లయిందనీ, ఇప్పుడు తనకు సేవలు చేస్తోంది భర్తే అనీ ఆమె గ్రహిస్తుంది. కానీ కొన్ని ప్రశ్నలు ఆమెను వేధిస్తూ ఉంటాయి. ఆ సమాధానాల కోసం ఆమె చేసే అన్వేషణే - ‘బిఫోర్ ఐ గో టూ స్లీప్’ నవల కథ. 2011 ఏప్రిల్ 28 న మార్కెట్లోకి వచ్చిన ఈ నవల సంచలనం సృష్టించింది. ‘గ్లాడియేటర్’, ‘బ్లాక్ హాక్ డౌన్’, ‘బాడీ ఆఫ్ లౌస్’ తదితర చిత్రాల దర్శకుడు రిడ్లీ స్కాట్ దృష్టిని ఆకర్షించింది. చదువుతున్నంతసేపూ ఎంతో ఉత్కంఠకు గురి చేసిన ఈ నవలను సినిమాగా తీద్దామనుకున్నారాయన. వెంటనే కథను సెట్స్పైకి ఎక్కించేశారు. రోవన్ జోఫె దర్శకత్వంలో నికోల్ కిడ్మెన్, మార్క్ స్ట్రాంగ్, కొలిన్ ఫిర్త్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్గా ‘బిఫోర్ ఐ గో టూ స్లీప్’ తెరకెక్కింది. హాలీవుడ్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే, ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయడానికి నిర్మాతలు విపుల్ షా, భూషణ్కుమార్లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించడానికి హీరో సైఫ్ అలీ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
బాలీవుడ్ తెరపై... కొరియా కథ
ఆ యువకుడు సాధారణ వ్యాపారి. ఒక పాప ప్రాణాలను రక్షించే ప్రయత్నంలో అతను అనుకోకుండా రెండు డ్రగ్స్ మాఫియా ముఠాలతో తలపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఆ యువకుడి గురించి కొన్ని నిజాలు బయటకొస్తాయి. ఇంతకీ అతను ఎవరు? ఆ పాప ప్రాణాలు కాపాడగలిగాడా అన్న కథాంశంతో లీ జియాంగ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన కొరియన్ చిత్రం ‘దమ్యాన్ ఫ్రమ్ నో వేర్’. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో జాన్ అబ్రహమ్ తానే హీరోగా, నిర్మిస్తున్నారు. హిందీలో ‘రాకీ హ్యాండ్సమ్’ అని పేరు పెట్టారు. గతంలో జాన్తో ‘ఫోర్స్’, అజయ్దేవగణ్తో ‘దృశ్యం’ చిత్రాలను తెరకెక్కించిన నిశికాంత్ కామత్ దర్శకుడు. శ్రుతీహాసన్, నటాలియా కౌర్ ముఖ్య తారలు.
ఫ్రెంచ్ సినిమా... మన వెండితెరపై!
మెడ కింద భాగం నుంచి శరీరం పనిచేయని క్వాడ్రప్లెజిక్ వ్యాధితో బాధపడే ఓ యువకుడికీ, అతని సంరక్షకుడైన ఒకప్పటి నేరస్థుడికీ మధ్య ఘట్టాలతో తెరకెక్కిన ఫ్రెంచ్ చిత్రం ‘ది ఇన్టచ్బుల్స్’. ప్యారా గ్లైడింగ్ సమయంలో ప్రమాదానికి గురై, మెడ కింద నుంచి శరీరం చచ్చుబడిపోయిన ఒక వ్యక్తి నిజజీవిత కథ ఆధారంగా ఈ ఫ్రెంచ్ చిత్రం తీశారు. ఈ చిత్రంలో ఫ్రాంకాయీస్ క్లుజెట్, ఒమర్ సై ముఖ్యతారలు. ఫ్రాన్స్లో జనం విపరీతంగా చూసిన ఈ సినిమా కూడా హిందీ తెరపైకి దిగుమతి అవుతోంది. మోహిత్ సూరి దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్జోహార్ ఈ హిందీ రీమేక్ను నిర్మించనున్నారు. ఇద్దరు హీరోలకు స్థానమున్న ఈ చిత్రంలో ఓ కథానాయకునిగా ‘ఆషికి 2’ ఫేమ్ ఆదిత్యారాయ్ కపూర్ను అనుకుంటున్నట్లు సమాచారం.
సౌతిండియన్ సినిమాలదీ అదే వరస!
విదేశీ చిత్రాల నుంచి కథ, కథనాన్ని అంది పుచ్చుకోవడంలో హిందీ దర్శక, నిర్మాతలే కాదు. మనవాళ్ళూ ముందంజలో ఉన్నారు. నాగార్జున, కార్తీ హీరోలుగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం తీస్తున్న ద్విభాషా చిత్రానికి కూడా ‘ది ఇన్టచబుల్స్’ అనే ఈ ఫ్రెంచ్ సినిమాయే ఆధారమని కోడమ్బాకమ్ వర్గాల కబురు. ఈ సినిమాలో తమన్నా ఒక కథానాయిక. కాగా, కమలహాసన్ నటిస్తూ, నిర్మిస్తున్న తాజా ద్విభాషా చిత్రం (తెలుగులో ‘చీకటి రాజ్యం’, తమిళంలో ‘తూంగావనమ్’) కూడా ఒక ఫ్రెంచ్ సినిమా ఆధారంగా అల్లుకున్నదేనని సమాచారం. ఫ్రెడరిక్ జార్డిన్ రూపొందించిన ‘స్లీప్లెస్ నైట్’ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ నుంచి ఈ సినిమా తయారవుతున్నట్లు కోడంబాకమ్ వర్గాల కథనం.
నిజానికి, ఇలా ప్రసిద్ధ విదేశీ చిత్రాల ఆధారంగా మన సినిమాలు రావడం కొత్తేమీ కాదు. కాకపోతే, ఒకప్పుడు ఫలానా సినిమాకు ఇవి రీమేక్లన్న విషయం చెప్పేవారూ కాదు... కష్టపడితే తప్ప తెలిసేదీ కాదు. ఉదాహరణకు ఆమిర్ఖాన్, పూజాభట్లతో మహేశ్భట్ తీసిన హిందీ చిత్రం ‘దిల్ హై కీ మాన్తా నహీ’ (1991) అంతకు కొన్ని దశాబ్దాల క్రితం నాటి ఫ్రాంక్ కాప్రా సినిమా ‘ఇట్ హ్యాపెన్డ్ వన్ నైట్’ (1934)కు ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్. కానీ, ఆయన ఆ విషయం చెప్పనూ లేదు. ఒప్పుకోనూ లేదు. కానీ, ఇప్పుడు అలా కాదు. ఏ సినిమాకు ఏది మాతృక అన్నది వెంటనే చెబుతున్నారు. లేదంటే తెలిసిపోతుంది. ఏ సినిమా దేనికి రీమేక్ అయినా, కథతో పాటు కథనంలోనూ పట్టు ఉంటేనే అది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని వేరే చెప్పాలా!
క్యాన్సర్తో బాధపడే అమ్మాయి ప్రేమ!
మలబద్ధకంతో బాధపడే తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకునే కూతురి పాత్రలో ‘పీకూ’ సినిమాలో నటి దీపికా పదుకొనే అదరగొట్టారు. ఈ అభినేత్రి ఇప్పుడు కాన్సర్తో బాధపడే యువతిగా నటించనున్నారట. చిత్ర కథేమిటంటే... క్యాన్సర్ బారిన పడి చిన్నతనం నుంచే జీవితం మీద ఆశలు వదులుకున్న ఓ అమ్మాయి, తన లాగే క్యాన్సర్తో బాధపడే ఓ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఏంటీ? నాగార్జున, గిరిజలతో దర్శకుడు మణిరత్నం తీసిన ‘గీతాంజలి’ గుర్తొస్తోందా? ఇంచుమించు ‘గీతాంజలి’ కథలా అనిపించే హాలీవుడ్ చిత్రం ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’. జాన్ గ్రీన్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. జోష్ బూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో షాలీన్ ఉడ్లీ, ఆన్సెల్ ఎల్గోర్ట్, నాట్ వోల్ఫ్ ముఖ్య తారలు. ఇప్పుడీ విషాదభరిత ప్రేమకథను బాలీవుడ్లో రీమేక్ చేద్దామనుకుంటున్నారు. దీపికా పదుకొనే కథానాయికగా దర్శకుడు హోమీ అడజానియా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు భోగట్టా. ఆద్యంతం నవ్వించేలా స్క్రిప్ట్లో మార్పులూ, చేర్పులూ చేస్తున్నారట దర్శకుడు హోమీ అడజానియా.
- శశాంక్