హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

Hema Press Meet On Bigg Boss 3 Telugu - Sakshi

మొదటి వారంలోనే బిగ్‌బాస్‌ హౌస్‌లోంచి ఎలిమినేట్‌ అయి ఇంటి బాట పట్టిన హేమ సంచలన నిజాలు బయటపెట్టింది. నేడు హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ అనుభవాలు, కంటెస్టెంట్ల ఆట తీరు, అందులో ఎవరు నటిస్తున్నారు?లాంటి విషయాలను వెల్లడించారు. తానేమీ గేమ్‌ ఆడలేదని, ప్లాన్‌ చేసుకుని వెళ్లలేదని, అక్కడి వాతావరణం అర్థంచేసుకునేలోపే బయటకు వచ్చానని అన్నారు. చివర్లో అక్కడ ఉండలేక.. గోడ దూకి పారిపోవాలని కూడా ప్లాన్‌ వేశానని అయితే అంతలోపే ఎలిమినేట్‌ చేసి బయటకు పంపించారంటూ పేర్కొంది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో తానేమీ డామినేషన్‌ చేయలేదని.. మన ఇంట్లో కూడా పిల్లలకు కండీషన్స్‌పెడితే నచ్చదు కదా అలాగే వారికి కూడా తాను నచ్చలేదని తెలిపింది. ఇంట్లో ఉప్పు,కారం కూడా సరిపోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోండంటూ వివరించింది. తన భర్తకు ఫుడ్‌ అంటే ఇష్టమని అది కావాలని ఇది కావాలని అడిగేదంటూ వితికా కిచెన్‌లోకి వచ్చేదని, గ్యాస్‌ పైనే హిమజ వేడి నీళ్లు పెట్టుకునేదని,అయితే ఇలాంటివన్ని షోలో ప్లే చేయలేదని.. తాను అరిచినవి మాత్రమే చూపించాడని తెలిపింది. 

ఇంకా హేమ మాట్లాడుతూ.. ‘నిన్న ప్రసారం అయిన ఎపిసోడ్‌లో చూసుంటే.. ఇంత తొందరగా కాఫీ పొడి అయిపోయిందని అలీ రెజా అన్నాడు.. అలాంటి పరిస్థితి రావద్దనే తాను అలా చేయాల్సి వచ్చింది. వంటగదిలోకి శ్రీముఖి వచ్చి.. అందరూ పాలు కావాలంటున్నారు.. రెండు మూడు సార్లు తాగుతున్నారని చెప్పింది. మళ్లీ బయటకు వెళ్లి వేరేలా చెప్పింది. ఆ రోజు డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూడా ఆ డైరెక్షన్స్‌ నాకొద్దు అని మామూలుగానే అన్నాను. అంతమందికి వంట చేసి పెట్టిన నాకు తెలీదా.. ఉన్న వాటితోనే నేను చేసిపెడతాను.. అయినా మనం చేయకపోతే వీళ్లకు చెప్పాలి కదా అని శ్రీముఖితో అన్నానని.. కానీ రాహుల్‌ వాయిస్‌ పెంచేసరికి తాను పెంచవలసి వచ్చింద’ని తెలిపింది.

ఇక ఒక్కో హౌస్‌మేట్స్‌ గురించి చెబుతూ.. వరుణ్‌ సందేశ్‌, శ్రీముఖి బాగా నటిస్తున్నారని తెలిపింది. శ్రీముఖి అందరి అటెన్షన్‌ పొందాలని చూస్తోందని, బాబా భాస్కర్‌ అందరితో మంచి అనిపించుకోవాలని అనుకుంటున్నాడు.. అయితే వచ్చేవారం అందరూ కలిసి బాబా భాస్కర్‌నే నామినేట్‌ చేయోచ్చేమోనని పేర్కొంది. తానొక జర్నలిస్ట్‌ను కదా కామెడీలు చేస్తే ఏం అనుకుంటారో అని జాఫర్‌ ఆలోచిస్తుంటాడని, వితికా, శ్రీముఖి ఇద్దరూ తనను బ్యాడ్‌ చేయడానికి ప్రయత్నించారని తెలిపింది. ఇంటాబయట హిమజ మానిప్యులేట్‌ చేస్తోందని, తన కప్పులు తాను కడగడని.. ఇదే విషయం రాహుల్‌కు చెప్పానని.. అయితే ఈవారం అదే కారణంతో నామినేట్‌ అయ్యాడని పేర్కొంది.

అలీ బాగానే ఆడుతున్నాడని, రోహిణి మాత్రం అందర్నీ నమ్మేస్తుందని.. శ్రీముఖే తనకు ఇంజెక్ట్‌ చేస్తుందని తెలిపింది. అందుకే అందరినీ నమ్మోద్దని వచ్చేటప్పుడు రోహిణికి చెప్పానని తెలిపింది. శివజ్యోతి (సావిత్రి) ఇంకా తన ఫ్యామిలీ, తన భర్త ఆ సెంటిమెంట్లోనే ఉందని, తనను కూడా పిండేస్తారని, తన ఒరిజినాలిటీ కూడా తొందర్లోనే బయటకు వస్తుందని వెల్లడించింది. అషూ రెడ్డికి ఇంకా మెచ్యురిటీ రావాలని..తను ఇంకొన్ని రోజులు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. మహేష్‌-వరుణ్‌ సందేశ్‌ విషయంలో అంత పెద్ద గొడవ జరిగితే అది చూపించకుండా కేవలం తాను అరిచినవి మాత్రమే చూపించారని తెలిపింది. బిగ్‌బాస్‌లో అందరూ ఆడటానికే వెళ్తారు.. నాటకాలు కూడా ఆడతారు.. తాను కూడా ఎలిమినేట్‌ కాకుండా ఉంటే గేమ్‌ ఆడేదాన్నేమోనని తెలిపింది. హౌస్‌లో ఉన్నవారందరికీ తానంటే ఇష్టమేనని.. బయటకు వచ్చాక రాహుల్‌ తనను చార్మినార్‌ తీసుకెళ్తానని అన్నాడని.. హౌస్‌లో ఉన్నవారంతా మంచివారేనంటూ చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top