శింబుదేవన్‌ దర్శకత్వంలో అందాల భామలు

Director Simbudevan New Movie Update - Sakshi

శింబుదేవన్‌ దర్శకత్వంలో ముగ్గురు అందాలభామలు నటించడానికి రెడీ అవుతున్నారు. శింబుదేవన్‌ అనగానే ఇంసైఅరసన్‌ 23ఆమ్‌ పులికేసి చిత్రమే టక్కున గుర్తుకు వస్తుంది. ఆ తరువాత కూడా ఆయన అరై ఎన్‌ 305 కడవుల్, ఇరుంబు కోట్టైటయిల్‌ మురట్టుసింగం, ఒరు కన్నియుమ్‌ 3 కలవాణిగళుమ్, పులి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తనకు మంచి పేరు తెచ్చి పెట్టిన ఇంసై అరసన్‌ 23ఆమ్‌ పులికేసి చిత్రానికి సీక్వెల్‌ చేయడానికి సన్నాహాలు చేసి షూటింగ్‌ను కూడా ప్రారంభించారు.

దర్శకుడు శంకర్‌ నిర్మించ తలపెట్టిన ఈ చిత్రానికి నటుడు వడివేలు, చిత్ర యూనిట్‌కు మధ్య విభేదాల కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. దీనికి సంబంధించిన పంచాయతీ చాలా కాలంగా జరుగుతూనే ఉంది. దీంతో దర్శకుడు శింబుదేవన్‌ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. దీనికి కసడ తపర అనే పేరును నిర్ణయించారు. ఇందులో నటుడు సందీప్‌కిషన్, హరీశ్‌కల్యాణ్, శాంతను హీరోలుగా నటించనున్నారు.

వారికి జంటగా నటి రెజీనా, ప్రియభవానీశంకర్, విజయలక్ష్మి నటించనున్నారు. ఇలా కుట్టి మల్టీస్టారర్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్‌ప్రభు, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ రవీంద్రన్‌ కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్ర కథను దర్శకుడు ఆరు భాగాలుగా స్క్రీన్‌ ప్లేను రచించారట. దీంతో ఆరుగురు ఛాయాగ్రాహకులు, ఆరుగురు సంగీతదర్శకులు దీనికి పనిచేయనున్నారట. చిత్ర షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. చిన్న గ్యాప్‌ తరువాత నటి రెజీనా కోలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం ఇది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top