క్షమాపణలు అడగాల్సింది పోగా...ప్రోత్సహించడం ఏంటి?
సాక్షి, చెన్నై : తమిళ బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ శరవణన్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన సంగతి తెలిసిందే. పైగా ఆ వ్యాఖ్యలను కమల్ హాసన్ ప్రోత్సహించినట్లుగా ఉండటం మరింత అగ్గి రాజేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ కాగా.. ఈ వ్యవహారంపై ప్రముఖ గాయని చిన్మయి కూడా స్పందించింది. తాజాగా బీజేపీ ప్రతినిధి నారాయణ తిరుపతి కూడా కమల్ తీరుపై మండిపడ్డారు.
‘ఒక బాధ్యతయుతమైన రాజకీయ నాయకుడిగా ఉన్న కమల్ హాసన్.. బిగ్ బాస్లో కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పమని అడగాల్సింది పోగా వాటిని ప్రోత్సహించినట్లుగా ఉందని’ అన్నారు. బిగ్ బాస్ షోలో ఆయన చేసింది అమోదయోగ్యంగా లేదని, శరవణన్ చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా సమర్థించడం సరికాదని ఆయన అన్నారు. అసలు ఇంతకు ఏం జరిగిందంటే.. శనివారం నాటి బిగ్ బాస్ కార్యక్రమంలో కమల్ హాసన్.. సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను గురించి చెప్పాడు. ఈ నేపథ్యంలో తాను కాలేజీకి వెళ్లే రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మహిళలను తాకుతూ ఆనందపడే వాడినని శరవణన్ తెలిపాడు. ఆ తర్వాత కమల్ దానిని ఒక సరదా సన్నివేశంగా మార్చి ఇప్పడు శరవణన్ అలాంటివాడు కాదు, పూర్తిగా మారిపోయి ఉంటాడంటూ ఆ సన్నివేశాన్ని దాటేశాడు.
సంబంధిత వార్తలు