ఓటీటీ వేదికగా విడుదల కానున్న స్వీటీ సినిమా

Anushkas Nishabdham Movie May Be Release On OTT Platforms - Sakshi

స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్‌, అంజలి, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లకు తాళం పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా మరోసారి వాయిదా పడింది. లాక్‌డౌన్‌ పొడగింపు, ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో దర్శకనిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

లాక్‌డౌన్‌ సమయాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. విడుదలకు సిద్దంగా ఉండి లాక్‌డౌన్‌తో విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాలకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఇవ్వడానికి ఓటీటీ సం​స్థలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఒకటిరెండు చిన్న సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై విడుదల అయ్యాయి. అయితే తాజాగా ఓ సంస్థ నిశ్శబ్దం సినిమాతో డీల్‌ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుష్క, మాధవన్‌, అంజలి వంటిస్టార్లు నటించడం, సౌతిండియాలో ఈ సినిమాపై క్రేజ్‌ ఎక్కువగానే ఉండటంతో ‘నిశ్శబ్దం’కు భారీ మొత్తంలో ఆఫర్‌ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు థియేటర్లోనే విడుదల చేస్తామని భీష్మించుకొని కూర్చున్న చిత్రబృందం కాస్త మెత్తపడినట్లు వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం డీల్‌ చివరి దశలో ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫిలింనగర్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

చదవండి:
పవర్‌ స్టార్‌ సరసన అనుష్క?
‘డియర్‌ విజయ్‌.. నేనర్థం చేసుకోగలను’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top