రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రంలో శింబు..?

Actor Simbu Reveals About Maghaa Maanadu - Sakshi

ఒక చిత్రం మిస్‌ అయితే స్టార్‌ హీరోలు పెద్దగా పట్టించుకోరు. అదిపోతే మరొకటి వస్తుందనే ధీమా వారికి  ఉంటుంది. ఇక సంచలన నటుడు శింబు అయితే అస్సలు కేర్‌ చేయరు. ఎందుకంటే  శింబులో కేవలం నటుడే మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాత, రచయిత కూడా. అలాంటి నటుడు తనే సొంతంగా చిత్రం చేసి తానేంటో నిరూపించుకోగలడు. ప్రస్తుతం శింబు అదే చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈయన వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో సురేష్‌ కామాక్షి నిర్మించతలపెట్టిన ‘మానాడు’ అనే చిత్రంలో నటించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరిగింది. మధ్యలో ఆగిపోయిందనే ప్రచారం జరగడంతో నిర్మాత సురేష్‌ కామాక్షీ మానాడు చిత్రం ఆగిపోలేదు, షూటింగ్‌ జరుగుతోందని వివరణ ఇచ్చారు.

అలాంటిది ఇటీవల సడన్‌గా అనివార్యకారణాల వల్ల  శింబుతో మానాడు చిత్రం చేయడం లేదని ప్రకటించారు. అయితే వేరే నటుడితో మానాడు చిత్రం ఉంటుందని, ఆ వివరాలను త్వరలోనే  వెల్లడించనున్నట్లు తెలిపారు.  అయితే ఆ వెంటనే శింబు అభిమానులను ఖుషీ చేసే వార్త వెలువడింది. ఎప్పుడైతే మానాడు నుంచి శింబును తొలగించిన వార్త ప్రచారం అయిందో ఆ వెంటనే శింబు తండ్రి టి.రాజేందర్‌ స్పందించారు. మానాడు పోతేనేం శింబు ‘మహా మానాడు’తో వస్తున్నాడు అని వెల్లడించి షాక్‌ ఇచ్చారు. అవును శింబు హీరోగా మహా మానాడు చిత్రం తెరకెక్కనుందని, ఆ చిత్రాన్నిశింబునే స్వీయ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించనున్నట్లు తెలిపారు.

ఇటీవల కుటుంబంతో సహా విదేశీ పర్యటన చేసినట్లు, ఆ సమయంలో మహా మానాడు చిత్ర కథ గురించి చర్చించినట్లు టి.రాజేందర్‌ చెప్పినట్లు తాజాగా  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌లో తమిళంతో పాటు ఐదు భాషలో రూపొందించనున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top