
వాషింగ్టన్: ఆర్థిక అవకాశాలు, సమ్మిళిత వృద్ధి పెంపు దిశగా భారత్–అమెరికా కలసి పనిచేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా పేర్కొన్నారు. హైదరాబాద్లో జరగనున్న పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు.. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్లను మరోసారి కలిసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. నవంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సదస్సు (జీఈఎస్)లో ఇవాంకా పాల్గొననున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె అమెరికాలో మీడియాతో మాట్లాడారు.
‘ఆలోచనలు పంచుకోవడం, సంబంధాల్ని విస్తృతం చేసుకోవడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనలు, ఆసక్తులు కార్యరూపం దాల్చేలా ప్రోత్సహించేందుకు జీఈఎస్ సదస్సు అనువైన వాతావరణాన్ని కల్పించేలా చేయడమే నా లక్ష్యం. ఆర్థిక అవకాశాలు, సమ్మిళిత వృద్ధి పెరిగేలా భారత్, అమెరికాలు కలసి పనిచేయాలి. ఇరు దేశ ప్రజల మధ్య గాఢమైన స్నేహం, పెరుగుతున్న ఆర్థిక, రక్షణ భాగస్వామ్యానికి ఈ సదస్సు ఓ సూచిక..’’అని ఇవాంకా పేర్కొన్నారు. సదస్సులో 127 దేశాల నుంచి 52.5 శాతం మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని.. తొలిసారిగా ఎక్కువ మంది మహిళా ప్రతినిధులు పాల్గొనడాన్ని తాను గర్వంగా భావిస్తున్నానని చెప్పారు.