విమానంలో 110మంది.. కూల్చేయమన్న పుతిన్‌

Vladimir Putin Ordered Downing Passenger Plane - Sakshi

మాస్కో : దాదాపు 110మందితో వెళుతున్న విమానాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 2014లో ఆయన ఈ మేరకు ఉన్నతాధికారులకు సూచించినట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే, వేల సంఖ్యలో ప్రాణాలు రక్షించేందుకే ఆయన అంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పుతిన్‌ పేరిట ఓ డాక్యుమెంటరీని తాజాగా ప్రదర్శించారు. ఇదిప్పుడు సోషల్‌ మీడియాలో కూడా లభిస్తోంది. రెండుగంటలపాటు సాగే ఈ వీడియోలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. 2014 ఫిబ్రవరి 7న సొచ్చిలో ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభం కానున్నాయి. వాటిని చూసేందుకు దాదాపు 40వేల మంది ఔత్సాహికులు వచ్చారు. ఆ కార్యక్రమానికి పుతిన్‌ కూడా వెళ్లాల్సి ఉంది.

సరిగ్గా ఆ సమయంలోనే పుతిన్‌కు నిఘా అధికారుల నుంచి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఖర్కివ్‌ నుంచి ఇస్తాంబుల్‌కు ప్రయాణిస్తున్న ఓ టర్కీ విమానాన్ని (టర్కీష్‌ పీగాసస్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ 737-800) ఉగ్రవాదులు హైజాక్‌ చేశారని, అందులో ఓ ప్రయాణీకుడికి బాంబు కూడా అమర్చారని, అది ప్రస్తుతం ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న సొచ్చి వైపు దూసుకొస్తుందని ఆ ఫోన్‌ కాల్‌ సమాచారం. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పుతిన్ వెంటనే తన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సత్వరమే చేయాల్సిన దానిపై చర్చించారు.

వెంటనే 110 మంది ప్రయాణిస్తున్న ఆ విమానాన్ని కూల్చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 40 వేలమంది ప్రాణాలు కాపాడటం ఎంతో ముఖ్యం అని వారికి చెప్పారు. ఆ తర్వాత ఆయన ఒలింపిక్స్‌ వద్దకు వెళ్లారు. అయితే, మరికొద్దిసేపటికీ ఆయనకు మరో ఫోన్‌ కాల్‌ వచ్చింది.. అంతకు ముందు వచ్చింది కేవలం ఫేక్‌ బెదిరింపు కాల్‌ అని, ఓ ప్రయాణీకుడు తాగి విమానంలో గొడవ చేశాడని, ప్రస్తుతం ఆ విమానం టర్కీ వైపే వెళుతుందని చెప్పారు. దీంతో పుతిన్‌ ఊపిరి పీల్చుకున్నారట. ఈ విషయాన్ని క్లెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ కూడా ధ్రువీకరించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top