
సెక్స్కు ఒప్పుకోలేదని.. 19 మంది దహనం
ఇరాక్ లో యాజ్దీ యువతులపై ఐఎస్ఐఎస్ టెర్రరిస్టుల పైశాచికత్వం నిరాఘటంగా కొనసాగుతోంది.
బాగ్దాద్: ఇరాక్లో యాజ్దీ యువతులపై ఐఎస్ఐఎస్ టెర్రరిస్టుల పైశాచికత్వం నిరాఘటంగా కొనసాగుతోంది. జిహాదీల వాంఛలు తీర్చేందుకు సెక్స్ బానిసలుగా మారడానికి ఒప్పుకోని 19 యాజ్దీ అమ్మాయిలను ఇనుపబోనులో బంధించి సజీవ దహనం చేశారు. ఈ దారుణ సంఘటన ఇరాక్లోని మోసుల్ పట్టణంలో చోటుచేసుకుందని స్థానిక మీడియా ప్రతినిధి అబ్దుల్లా అల్ మల్లా కుర్దీష్ వార్తా సంస్థ ఏఆర్ఏ న్యూస్కు వెల్లడించారు. వందలాది మంది ప్రజలు చూస్తుండగానే టెర్రరిస్టులు ఈ దారుణ మారణకాండకు పాల్పడ్డారని, వారిని రక్షించేందుకు ప్రజలెవరూ కూడా సాహసించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇప్పటికే మూడువేల మంది యాజ్దీ అమ్మాయిలను సెక్స్ బానిసలుగా చేసుకున్న టెర్రరిస్టులు వారిపై అకృత్యాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇరాక్లోని యాజ్దీ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ఆక్రమించుకున్న 2014 నుంచి వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. సెక్స్ బానిసలుగా మారేందుకు ఒప్పుకోని యాజ్దీ యువతులను గతంలో కూడా దారుణంగా కొట్టి చంపారు. క్రైస్తవం, జొరాస్ట్రియన్, ఇస్లాం మతాన్ని ఆచరించే యాజ్దీ జాతి ప్రజలను ఐఎస్ఐఎస్ సైతాన్ ఆరాధకులుగా ముద్రవేస్తూ వారిపై పైశాచిక చర్యలకు పాల్పడుతోంది. వారి ఆగడాలను భరించలేక ఇప్పటికే దాదాపు యాభైవేల మంది యాజ్దీలు దేశం విడిచి పారిపోయారు.