సాక్షి,హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ తెహరీక్–ఇ–హిందుస్థాన్ (టీటీహెచ్) చీఫ్ షెహజాద్ బట్టీ అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ, మేడ్చల్ పోలీసులకు చిక్కిన జాయిద్ ఖాన్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడి నుంచి షెహజాద్ అనుచరులు అబిద్, రానాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) నెంబర్ తీసుకోవాలని భావించారు. మరికొన్ని ఆపరేషన్లకు ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచి్చంది. తదుపరి విచారణ కోసం జాయిద్ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ కేసులో షెహజాద్తో పాటు అబిద్, రానాలను వాంటెడ్గా చేర్చారు. పోలీసుల దర్యాప్తు, నిందితుడి విచారణలో అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చిన అంశాలివి... ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన జాయిద్ అలియాస్ ఆదిల్ ఖాన్ (22) నాలుగో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు.
ఇతడి బంధువైన ఫైజాన్ మేడ్చల్లోని ముబారక్ రెస్టారెంట్లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అతడి ద్వారానే జాయిద్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మేడ్చల్ వచ్చి అదే హోటల్లో సర్వర్గా చేరి అదే రెస్టారెంట్లో నివసిస్తున్నాడు. 2021 నుంచి జాయిద్కు రెండు ఇన్స్ట్రాగామ్, ఓ ఫేస్బుక్, మరో వాట్సాప్ ఖాతాలు ఉన్నాయి. 2023లో ఓ బొమ్మ పిస్టల్ ఖరీదు చేసిన జాయిద్ దాంతో వీడియోలు తీసి అప్లోడ్ చేయడం మొదలెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిజమైన తుపాకీ ఖరీదు చేయాలని భావించిన జాయిద్ దానికోసం గూగుల్తో పాటు ఇన్స్ట్రాగామ్లో సెర్చ్ చేశాడు. వాటి ద్వారా మధ్యప్రదేశ్లోని ఖర్గోన్కు చెందిన వ్యక్తి విదేశీ పిస్టల్స్ విక్రయిస్తాడని తెలిసింది. అతడి ఫోన్ నెంబర్ సంగ్రహించిన జాయిద్ సంప్రదించాడు. ఫిబ్రవరి 27న అతడు కొన్ని తుపాకుల ఫొటోలను షేర్ చేశాడు. ఇలా ఇన్స్ట్రాగామ్లో అబిద్ జట్, రానా హుస్సేన్లను ఫాలో అవడం ప్రారంభించాడు. వీళ్లు ఆయుధాలతో అనేక ఫొటోలు, వీడియోలను తమ పేజ్ల్లో పోస్టు చేశారు.
ఈ ద్వయం దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న తెహరీక్–ఇ–హిందుస్థాన్ (టీటీహెచ్) ఉగ్రవాద సంస్థను నిర్వహిస్తున్న షెహజాద్ బట్టీ అనుచులుగా ఉన్నారు. అక్రమ ఆయుధాల వ్యాపారం, టార్గెట్ కిల్లింగ్ చేసే బట్టీ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఐఎస్ఐ కోసం దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాలు తెలిసీ జాయిద్ వారితో సంబంధాలు కొనసాగించాడు. అబిద్ జట్ కోరడంతో జాయిద్ ఈ ఏడాది ఏప్రిల్ 2న ప్రయాగ్రాజ్కు చెందిన చోటా యోగి అనే వ్యక్తి వివరాలను ఇన్స్ట్రాగామ్ ద్వారా షేర్ చేశాడు. అప్పటి నుంచి అబిద్, రానాలు తమ ఫోన్ నెంబర్లు పంపి, వాట్సాప్ సంప్రదిపులు ప్రారంభించారు.
ఈ నెల 10న అబిద్ జట్ తన పోస్టర్ను జాయిద్కు షేర్ చేశాడు. ‘పాకిస్థానీ డాన్ అబిద్ జట్’ అనే క్యాప్షన్తో ఉన్న ఈ పోస్టర్స్ను వెయ్యి ప్రింట్ తీసి, ఘజియాబాద్ ప్రాంతంలో అంటించాలని, ఆ వీడియోలను తనకు పోస్టు చేయాలని, అలా చేస్తే ఓ అసలైన పిస్టల్ పంపిస్తానని అబిద్ చెప్పాడు. దీనికి జాయిద్ అంగీకరించాడు. ఈ నెల 20న జాయిద్ను సంప్రదించిన రానా తనకు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పీఏ ఫోన్ నెంబర్ కావాలని కోరాడు. దీనికోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన జాయిద్ యూపీ క్యాబినెట్ మంత్రులు, ప్రజా ప్రతినిధులకు చెందిన వారి వివరాలను దొరకడంతో అవన్నీ షేర్ చేశాడు. ఘజియాబాద్ వెళ్లినప్పుడు అబిద్ జట్ పోస్టర్లు అంటించి, అసలు పిస్టల్ పొందాలని జాయిద్ ఎదురు చూస్తున్నాడు.


