‘వారిని అమెరికాకు అమ్మేశారు’ | Pervez Musharraf Sold 4,000 Pakistanis To US | Sakshi
Sakshi News home page

‘వారిని అమెరికాకు అమ్మేశారు’

Apr 17 2018 5:46 PM | Updated on Jul 25 2018 1:49 PM

Pervez Musharraf Sold 4,000 Pakistanis To US - Sakshi

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ (ఫైల్‌ఫోటో)

ఇస్లామాబాద్‌ :  పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌పై మాజీ న్యాయమూర్తి జావేద్‌ ఇక్బాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలాది పాకిస్తానీలను ముషారఫ్‌ అమెరికాకు విక్రయించారని ఇక్బాల్‌ వెల్లడించడం కలకలం రేపింది. పాక్‌ జాతీయ అసెంబ్లీ మానవ హక్కుల స్టాండింగ్‌ కమిటీ ఎదుట గల్లంతైన వ్యక్తుల కమిషన్‌కు సారథ్యం వహించే ఇక్బాల్‌ ఈ వివరాలు వెల్లడించారు. డాలర్ల కోసం ముషారఫ్‌ 4000 మంది పాకిస్తానీలను అమెరికాకు అప్పగించారని అంటూ దీన్ని రహస్య అప్పగింతగా ఆయన అభివర్ణించారు.

బెలూచిస్తాన్‌ ప్రాంతంలో స్ధానికుల గల్లంతు అంశం పాక్‌ ప్రభుత్వానికి సవాల్‌గా మారిన నేపథ్యంలో ఇక్బాల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముషరఫ్‌ చర్యలు అక్రమం, చట్టవిరుద్ధమని దీనిపై తదుపరి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. చట్టాల కళ్లుగప్పి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తానీలను రహస్యంగా ఇతర దేశానికి కొందరు ఎలా అప్పగిస్తారని ఇక్బాల్‌ ప్రశ్నించారు. ముషారఫ్‌ చర్యలను అప్పటి ప్రభుత్వంలో పార్లమెంటేరియన్లు ఎవరకూ ప్రశ్నించకపోవడం గమనార్హం. గల్లంతైన వ్యక్తుల అంశం పాక్‌ సుప్రీంకోర్టులో ఏళ్లతరబడి నానుతూనే ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement