మార్స్‌పైకి మనిషి..!

NASA Research On Mars - Sakshi

వాషింగ్టన్‌ : మార్స్‌ గ్రహంపై మనిషి జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉందేమోనని చాలా ఏళ్లుగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా  అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రోవర్లను పంపి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తోంది. అయితే మొట్టమొదటిసారిగా మార్స్‌ మీదకు మనిషిని పంపే యోచనలో ఉన్నారు. అదీ కూడా ఓ మహిళ కావడం విశేషం. అన్నీ సవ్యంగా జరిగితే మార్స్‌ మీద తొలి అడుగు వేసేది మహిళేనని నాసా అడ్మినిస్ట్రేటర్‌ జిమ్‌ బ్రిడెన్‌స్టైన్‌ వెల్లడించారు. సైన్స్‌ ఫ్రైడే అనే ఒక  రేడియో టాక్‌ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే ఇప్పటివరకు ఎవరిని మార్స్‌ మీదకు పంపించాలో నిర్ణయించలేదని, భవిష్యత్తులో నాసా చేపట్టే కార్యక్రమాల్లో  పాల్గోనే మహిళనే పంపించే అవకాశం ఉందన్నారు. మూన్‌ మీదకు కూడా మహిళను పంపిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా ... ఆయన తప్పకుండా మూన్‌ మీదకు వెళ్లే రెండో వ్యక్తి మహిళే అవుతారన్నారు. మార్చి నెల జాతీయ ఉమెన్స్‌ నెలగా పరిగణిస్తున్నాం. ఈ సందర్భంగా మహిళా వ్యోమగాములు స్పేస్‌వాక్‌ చేయనున్నారని, ఈ నెలాఖరునాటికి మహిళల స్పేస్‌వాక్‌ పూర్తవుతుందని తెలిపారు. దీనిలో భాగంగా ఇద్దరు వ్యోమగాములు స్పేస్‌ చుట్టూ తిరుగుతారని జిమ్‌ పేర్కొన్నారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top