చిలీలో విమానం గల్లంతు
శాంటియాగో : చిలీకి సంబంధించిన మిలటరీ విమానం ఒకటి సుమారు 38 మంది ప్రయాణీకులతో గల్లంతయ్యింది. దేశానికి దక్షిణాన ఉన్న ఓ స్థావరం నుంచి అంటార్కిటికా వెళ్లేందుకు టేకాఫ్ తీసుకున్న విమానం కూలిపోయి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సోమవారం ఉదయం సుమారు 4.55 గంటలకు సీ–130 విమానం పుంటా ఎరీనా నుంచి టేకాఫ్ తీసుకుందని, 6.13 గంటలకు సంబంధాలు తెగిపోయాయని చిలీ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఎమర్జెన్సీ పొజిషనింగ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నప్పటికీ అది పనిచేస్తున్నట్లుగా లేదని వాయుసేన అధికారి ఎడ్యురాడో మోస్కూయిరా తెలిపారు.