రైల్వేస్టేషన్లోని లిఫ్టులో మహిళను వేధించినందుకు సింగపూర్లో ఓ భారతీయుడికి నాలుగు వారాల జైలుశిక్ష విధించారు.
రైల్వేస్టేషన్లోని లిఫ్టులో మహిళను వేధించినందుకు సింగపూర్లో ఓ భారతీయుడికి నాలుగు వారాల జైలుశిక్ష విధించారు. కందసామి కృష్ణన్ (27) అనే ఆ వ్యక్తి సింగపూర్లోని ఓ విద్యుత్ ఉపకరణాల కంపెనీలో పనిచేస్తాడు. సింగపూర్లోని సెరాంగూన్ రైల్వేస్టేషన్లోని ఓ లిఫ్టులో ఫిలిప్పీన్స్కు చెందిన 28 ఏళ్ల మహిళను చెయ్యి పట్టుకుని గట్టిగా లాగి ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడని అతడి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన ఈ సంవత్సరం మార్చి 7వ తేదీన జరిగింది. అయితే తాను నిర్దోషినని, ఆమెను తానేమీ చేయలేదని కందసామి కోర్టులో వాదించాడు.
ఆరోజు ఉదయం 7.45 గంటలకు అతడు అప్పర్ సెరాంగూన్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కాడని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అస్రాన్ సమద్ తెలిపారు. వీధిలోకి వెళ్లేందుకు ఆమె లిఫ్టులోకి వెళ్లగానే, కందసామి ఆమె వెంటపడి.. లిఫ్టు తలుపు దాదాపు మూసుకుపోతుండగా లోపలకు వెళ్లాడని, ఆమె చెయ్యి పట్టుకుని లాగి ముద్దు పెట్టుకోబోయాడని అన్నారు. దీంతో న్యాయమూర్తి అతడికి నాలుగు వారాల జైలుశిక్ష విధించారు.