దేశంలో వేగంగా పెరుగుతున్న భూముల సారహీనత కారణంగా దేశ ఆహార భద్రత ప్రమాదంతో పడిన విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
‘ల్యాండ్ డీగ్రేడేషన్ న్యూట్రల్’ను ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో వేగంగా పెరుగుతున్న భూముల సారహీనత కారణంగా దేశ ఆహార భద్రత ప్రమాదంతో పడిన విషయాన్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. భూమి, నీరు, జీవ వైవిధ్యతల మెరుగైన నిర్వహణ ద్వారా భూవనరుల స్థితిగతులను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ‘ల్యాండ్ డీగ్రేడేషన్ న్యూట్రల్’ అనే ప్రతిష్టాత్మక పథకాన్ని మంగళవారం ప్రకటించింది. ప్రజాజీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతున్న భూముల ఎడారీకరణ, సారహీనత, నిరుపయోగ భూములు మారడం.. అనే సవాళ్లను ఎదుర్కొని 2030 నాటికి భూముల సారహీనతను తటస్థీకరించాలని ఈ పథకంలో లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.
ఇందుకు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, జలవనరులు.. తదితర సంబంధిత శాఖల సమన్వయానికి పర్యావరణ శాఖ కృషి చేస్తుందన్నారు. పేదరిక నిర్మూలనకు నడుం బిగించిన మోడీ సర్కారుకు.. ఈ పథకం తోడ్పడుతుందన్నారు. ‘ప్రపంచ ఎడారీకరణ వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా మంగళవారం వాతావరణ శాఖ, జాతీయ అటవీ పరిశోధక మండలి సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జవదేకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల సహకారంతో భూముల సారహీనతను తటస్థీకరించే తమ లక్ష్యం నెరవేరుతుందని కార్యక్రమం అనంతరం జవదేకర్ ట్వీట్ చేశారు.