భారత్లో జిన్పింగ్ : ఇమ్రాన్ అసహనం
సాక్షి, న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్లో కాలుమోపిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ పరిణామాలపై మీడియా కవరేజ్ సవ్యంగా లేదని ఇమ్రాన్ తప్పుపట్టారు. హాంకాంగ్ నిరసనలకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్న విదేశీ మీడియా కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలను విస్మరిస్తోందని దుయ్యబట్టారు. హాంకాంగ్ నిరసనలను పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్న అంతర్జాతీయ మీడియా జమ్ము కశ్మీర్లో యదేచ్ఛగా సాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఎలా విస్మరిస్తోందో తనకు అర్థం కావడం లేదంటూ ఇమ్రాన్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన వివాదాస్పద ప్రాంతాన్ని భారత్ తన దళాల గుప్పిట్లో పెట్టుకుని 80 లక్షల కశ్మీరీల గొంతు నొక్కుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఇమ్రాన్ ఖాన్ భారత్పై విమర్శలు గుప్పిస్తూ అంతర్జాతీయ వేదికలపై రాద్ధాంతం చేస్తున్న సంగతి తెలిసిందే.