గుడ్‌న్యూస్‌ చెప్పిన ఖతార్‌

Finally, Qatar Lifts Exit Visa System, Makes Return Easier For Migrant Workers - Sakshi

విదేశీ వర్కర్లకు ఖతార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివాదాస్పద ఎగ్జిట్‌ వీసా విధానాన్ని సవరిస్తున్నట్టు ఖతార్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ దేశంలో పనిచేస్తున్న లక్షల మంది వలస కార్మికులకు భారీ ఊరట కలిగింది. ఈ వీసా విధానం సవరణతో, యజమానులు(ఎంప్లాయర్స్‌) అనుమతి లేకుండానే.. కార్మికులు ఆ దేశం విడిచి రావొచ్చు. సుదీర్ఘకాలంగా కార్మిక హక్కుల సంఘాలు చేస్తున్న ఈ డిమాండ్‌ను ఖతార్‌ ప్రభుత్వం ఆమోదించింది. ఖతార్‌లో పనిచేస్తున్న చాలా మంది వలస కార్మికులను ఆ దేశం విడిచి వెళ్లకుండా ఎంప్లాయర్స్‌ వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల కాంట్రాక్ట్‌ సమయం అయిపోయినప్పటికీ, యజమానులు తమల్ని విడిచిపెట్టడం లేదని కార్మికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఖతార్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విదేశీ కార్మికులకు భారీ ఊరటనిస్తోంది. ప్రస్తుతం ఖతార్‌లో 16 లక్షల మందికి పైగా విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి వెళ్లినవారే. వారిలో ఎక్కువగా కూడా భారత్‌ నుంచి ఖతార్‌ వెళ్లినవారే ఉన్నారు. 

ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. దీని వల్ల వలస కార్మికుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆ సంస్థ తెలిపింది. ఖతార్ ప్రభుత్వంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం కార్మికులకు కనీస వేతనం, బకాయి వేతనాల చెల్లింపు, ఫండ్లు అందనున్నాయి. ఖతార్లోని వలస కార్మికులకు మంచి పనిని, రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ మంత్రి ఇస్సా సాద్ అల్ జఫర్ అల్-నూమిమి తెలిపారు. 2022లో ఖతార్‌ ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ను నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ పనుల్లో భారీ ఎత్తున్న విదేశీ కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఖతార్‌లో పనిచేస్తున్నారు. అయితే ఎగ్జిట్‌ వీసా విధానంలో సవరణలు తీసుకొచ్చినప్పటికీ, విదేశీ కార్మికులు, ఉద్యోగాన్ని మారాలనుకుంటే, ప్రస్తుత యజమానుల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంది. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top