రసాయనాలు తాగించండి | Donald Trump says he spoke sarcastically about injecting disinfectants | Sakshi
Sakshi News home page

రసాయనాలు తాగించండి

Apr 25 2020 1:18 AM | Updated on Apr 25 2020 10:30 AM

Donald Trump says he spoke sarcastically about injecting disinfectants - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌–19 అమెరికాను అతలాకుతలం చేస్తూ ఉంటే చేష్టలుడిగి చూస్తున్న ట్రంప్‌ అత్యంత ప్రమాదకర సలహాలు ఇవ్వడానికీ వెనుకాడటం లేదు. అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తాజా అధ్యయనంలో సూర్యరశ్మి, గాలితో తేమ కరోనా వైరస్‌ను చంపేస్తుందని తేలింది. దీంతో ట్రంప్‌ కోవిడ్‌ రోగులకు వైరస్‌ను నాశనం చేసే రసాయనాలు ఇంజెక్ట్‌ చేయాలని, అతినీలలోహిత కిరణాలను రోగుల శరీరంలోకి పంపించి వైరస్‌ను చంపాలని సలహా ఇచ్చారు.

వైట్‌ హౌస్‌లో గురువారం విలేకరుల సమావేశంలో హోంల్యాండ్‌ సెక్యూరిటీ చేసిన అధ్యయనం ఫలితాలను ఆ శాఖ సహాయ మంత్రి బిల్‌ బ్రయాన్‌ వెల్లడించిన వెంటనే ట్రంప్‌ కోవిడ్‌ రోగుల్లోకి వైరస్‌ను చంపేసే రసాయనాలు ఇంజెక్ట్‌ చేయాలని సలహా ఇచ్చారు. ‘రసాయనాలు, ఎండ తీవ్రతకి వైరస్‌ కేవలం నిముషంలోనే చచ్చిపోవడం చూస్తున్నాం. కోవిడ్‌ రోగుల ఊపిరి తిత్తుల్లోకి అల్ట్రావయోలెట్‌ కిరణాల్ని పంపించి చంపలేమా ? అది ఎలా చేయాలో ఆలోచించండి’అంటూ వ్యాఖ్యాని ంచడం అందరినీ విస్మయంలోకి నెట్టేసింది.  ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయనపై విమర్శలు కూడా అదే స్థాయిలో వెల్లువెత్తాయి. రోగుల ప్రాణాలతో ఆడుకునే అలాంటి ప్రమాదకరమైన సలహాలు పాటించవద్దంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.

చైనా మూల్యం చెల్లించుకుంటుంది
కరోనా మహమ్మారిపై సమాచారాన్ని ఇతర దేశాలతో పంచకుండా ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన చైనా తగిన మూల్యం చెల్లించు కుంటుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు.  

► బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ భారత్‌ సహా దక్షిణాసియా దేశాలను ఆదుకోవడానికి కోవిడ్‌ అత్యవసర నిధిని ప్రారంభించారు.   

► టర్కీలో ఇస్తాంబుల్‌ మరో వూహాన్‌గా మారిందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఫరేటిన్‌ కోకా ఆందోళన వ్యక్తం చేశారు. టర్కీలో లక్షా 4 వేలకి పైగా కేసులు నమోదైతే, 2,600 మంది వరకు మృతి చెందారు. అందులో అత్యధికభాగం ఇస్తాంబుల్‌లోనే నమోదయ్యాయి.  

► రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందులపై బంగ్లాదేశ్‌ నిషేధం విధించింది. దేశంలో కరోనా కేసులు 5 వేలకు చేరడంతో అందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది.


అమెరికాలో 50 వేల మంది మృతి
అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం 50వేల మరణాలు దాటాయి. గత 24 గంటల్లోనే 3,176 మంది మరణించినట్లు తెలిపింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక మరణాలు నమోదైన దేశం అమెరికానే కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడొంతుల్లో ఒక వంతు అగ్రరాజ్యంలోనే ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement