భారత రెస్టారెంట్‌పై బాంబుదాడి

Bomb blast in Indian restaurant  - Sakshi

టొరంటో: కెనడాలోని ఓ భారతీయ రెస్టారెంట్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బాంబుదాడికి పాల్పడ్డారు. ఒంటారియో ప్రావిన్సులోని మిస్సిస్వాగాలో ‘బాంబే భేల్‌’ రెస్టారెంట్‌లో శక్తిమంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. ఈ దాడిలో ముగ్గురు భారత సంతతి కెనడియన్లుసహా 15 మందికి గాయాలయ్యాయి. ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు పెయింట్‌ క్యాన్‌ లేదా బకెట్‌ పరిమాణంలో ఉన్న ఐఈడీ బాంబుతో రెస్టారెంట్‌లోకి వచ్చారు. అనంతరం దాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారన్నారు. వీరువెళ్లిన కొద్దిసేపటికే శక్తిమంతమైన పేలుడు సంభవించింది.

దుండగుల కోసం పోలీసులు భారీస్థాయిలో గాలింపు చేపట్టారు. ఇది ఉగ్రదాడా? లేక విద్వేషపూరిత దాడా? అన్నది ఇప్పుడే ఏం చెప్పలేమని పోలీసులు అన్నారు. కెనడాలో ఆరో అతిపెద్ద నగరమైన మిస్సిస్వాగాలో 7 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో భారత్‌ నుంచి వలసవెళ్లినవారి సంఖ్య గణనీయంగా ఉంది. టొరంటోలోని భారత కాన్సుల్‌తో పాటు కెనడాలోని భారత హైకమిషనర్‌ నుంచి ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. అధికారులు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నారన్నారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top