ఆ కేసులో అయిదుగురికి మరణశిక్ష | 5 Sentenced To Death For Killing Saudi Journalist Jamal Khashoggi | Sakshi
Sakshi News home page

ఆ కేసులో అయిదుగురికి మరణశిక్ష

Dec 23 2019 4:04 PM | Updated on Dec 23 2019 4:13 PM

జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగ్గి (ఫైల్‌ ఫోటో) - Sakshi

రియాద్‌ : జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగ్గి హత్య  కేసులో సౌదీ అరేబియా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ అరేబియా కోర్టు సోమవారం అయిదుగురికి మరణశిక్షను విధించింది. ఈ కేసులో మొత్తం 11 మందిలో, ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్షను ఖరారు  చేసింది. మిగిలిన వారిని  నిర్దోషులుగా ప్రకటించింది. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఐదుగురు వ్యక్తులకు కోర్టు మరణశిక్ష విధించిందని ప్రాసిక్యూటర్ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ కేసును విచారించిన రియాద్ కోర్టు అంతర్జాతీయ సమాజ ప్రతినిధులతో పాటు ఖషోగ్గి బంధువులు హాజరయ్యారనీ, మొత్తం తొమ్మిది సెషన్లను నిర్వహించినట్లు ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఇదొక తప్పుడు ఆపరేషన్ అని సౌదీ అరేబియా ప్రాసిక్యూటర్ నేడు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్టు చేసి విచారించారు. వారి వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. అలాగే ఈ హత‍్య ముందస్తు పథకం ప్రకారం చేసింది కాదని స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో మాజీ డిప్యూటీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహ్మద్ అల్ అసిరిని తగినన్నిసాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా  విడుదల చేశారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి  హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ హత్యలో సౌదీ పాత్ర ఉన్నట్లు అమెరికా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement