మొజాంబిక్‌లో దాడి.. 16 మంది మృతి | 16 killed in Mozambique insurgency attack | Sakshi
Sakshi News home page

మొజాంబిక్‌లో దాడి.. 16 మంది మృతి

Jun 1 2019 5:08 AM | Updated on Jul 29 2019 5:43 PM

16 killed in Mozambique insurgency attack  - Sakshi

మపుటో: తూర్పు ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో ఇస్లామిక్‌ తీవ్రవాదులు మంగళవారం 16 మందిని హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో అనే ముస్లిం ఆధిక్య ప్రాంతంలో ఇస్లామిక్‌ తీవ్రవాదులు 2017 అక్టోబర్‌ నుంచి దాడులకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు కనీసం 200 మంది ప్రజలను చంపేశారు. వేలాది మంది ప్రజలు ఇళ్లు వదిలిపారిపోయారు. తాజాగా మంగళవారం మిత్సుబిషి ట్రక్కులో ప్రయాణికులు, సరుకులను వేసుకుని వెళ్తుండగా తీవ్రవాదులు దాడి చేశారు. ఇంట్లో తయారు చేసుకొచ్చిన పేలుడు పదార్థాలను తీవ్రవాదులు ట్రక్కుపై విసిరి, అనంతరం కాల్పులు ప్రారంభించారు. వాహనంలోనే ఎనిమిది మంది చనిపోయారనీ, కిందకు దిగి పారిపోతుండగా కాల్చడంతో మరో ఏడు మంది కూడా మరణించారనీ, మరో వ్యక్తి బుధవారం చనిపోయాడిన స్థానిక వ్యక్తి చెప్పారు.

అఫ్గాన్‌లో కారుబాంబు దాడి
కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఉదయం అమెరికా కాన్వాయ్‌ లక్ష్యంగా జరిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడిలో నలుగురు పౌరులు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. అమెరికా భద్రతాదళ సిబ్బందిలోనూ నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. గత రెండ్రోజుల్లో కాబూల్‌లో జరిగిన రెండో ఆత్మాహుతి దాడి ఇది. కాబూల్‌లోని యాకతోత్‌లోని భవనాలను అమెరికా, నాటో బలగాలు భద్రతగా ఉంటాయి. అక్కడికి దగ్గర్లోనే అఫ్గానిస్తాన్‌ జాతీయ భద్రతా దళాల భవనాలు కూడా ఉంటాయి. అమెరికా దళాల వాహనశ్రేణి వెళ్తుండగా తాలిబన్‌ ఉగ్రవాది కారుతో వెళ్లి ఢీకొట్టాడు. 

Advertisement
 
Advertisement
Advertisement