రోహిత్ ఆత్మహత్య పై ఎందుకు స్పందించడం లేదు | Why did not respond to suicide Rohit | Sakshi
Sakshi News home page

రోహిత్ ఆత్మహత్య పై ఎందుకు స్పందించడం లేదు

Jan 27 2016 3:00 AM | Updated on Nov 6 2018 7:56 PM

హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎందుకు స్పందించడం లేదని..

సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన ఓయూ విద్యార్థి జేఏసీ
ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయ గేటు వద్ద ధర్నా


సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎందుకు స్పందించడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థి జేఏసీ ప్రశ్నించింది. రోహిత్ ఆత్మహత్య ఘటన చోటు చేసుకొని 10 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడాన్ని నిరసిస్తూ ఓయూ విద్యార్థి జేఏసీ మంగళవారం సచివాలయ ముట్టడికి యత్నిం చింది. విద్యార్థులను పోలీసులు నిలువరించడంతో ధర్నా నిర్వహించారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేముల రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారందరినీ పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత భాస్కర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగర నడిబొడ్డునున్న హెచ్‌సీయూలో ఒక దళిత విద్యార్థి మృతి చెందితే కనీసం సంతాపం కూడా ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు.

 వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరామర్శిస్తున్నా.. సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. రోహిత్ మృతికి కారణమైన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, వీసీ అప్పారావు, ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్‌లను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నెల 29న సీఎం అధికారిక నివాసాన్ని ముట్టడిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement