వివాహానికి వెళ్తూ అనంతలోకాలకు.. | Three teenagers killed in car collision with tree | Sakshi
Sakshi News home page

వివాహానికి వెళ్తూ అనంతలోకాలకు..

Aug 24 2013 1:21 AM | Updated on Sep 1 2017 10:03 PM

వివాహ కార్యక్రమానికి వెళ్తూ ముగ్గురు యువకులు విగతజీవులయ్యారు. అతివేగమే వారిని బలిగొంది. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

వైరా, న్యూస్‌లైన్:  వివాహ కార్యక్రమానికి వెళ్తూ ముగ్గురు యువకులు విగతజీవులయ్యారు. అతివేగమే వారిని బలిగొంది. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.   వివరాలు...సికింద్రాబాద్‌కు చెంది న కొణతం వరుణ్‌కృష్ణ సోదరుడి వివాహం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం తెల్లవారుజామున జరగనుంది. ఈ వివాహానికి హాజరయ్యేందుకు వరుణ్‌కృష్ణ, తన స్నేహితులతో కలిసి బయలుదేరారు.

ఖమ్మంలోని పెళ్లి కుమారుడి అమ్మమ్మ ఇంట్లో శుక్రవారం  ఒడుగుకు హాజరయ్యారు.  ఇది ముగిసిన తర్వాత ఖమ్మం నుంచి పెళ్లికొడుకు కారు బయలుదేరాకా, వెనుక స్నేహితులందరూ మరో కారులో సత్తుపల్లికి పయనమయ్యారు. అతివేగంగా వెళ్తున్న వీరి కారు వైరా మండలం స్టేజీ పినపాక వద్ద రోడ్డు ఎడమ వైపు నుంచి ఒక్కసారిగా కుడివైపునకు దూసుకువచ్చి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది.  ఈ ఘటనలో కడపకు చెందిన యూటీఎఫ్ జిల్లా నాయకుడి కుమారుడు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బీరం శ్రీధర్‌రెడ్డి(30), ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన బాలా ప్రదీప్(31) అక్కడికక్కడే మృతి చెందారు.  

స్థానికులు 108 వాహనంలో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బెల్లంపల్లికి చెందిన కిరణ్(30) చికిత్స పొందుతూ మృతి చెందాడు.  వరుణ్‌కృష్ణ, వరంగల్‌కు  చెందిన హరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న కిరణేశ్వర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సిరిపురం గ్రామ రెవెన్యూ అధికారి సాంబశివరావు ఫిర్యాదు మేరకు వైరా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement