వందలు కాదు.. వేలల్లో అక్రమార్కులు! | Thousands of Irregulars | Sakshi
Sakshi News home page

వందలు కాదు.. వేలల్లో అక్రమార్కులు!

Apr 25 2016 2:57 AM | Updated on Sep 3 2017 10:39 PM

వచ్చే నెల ఒకటిన జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో మాస్‌కాపీయింగ్‌కు అవకాశం లేకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

♦ వరుస ఐడీలతో టెట్ హాల్‌టికెట్ల జనరేషన్‌ను గుర్తించిన అధికారులు
♦ సెంటర్లలో జంబ్లింగ్‌కు చర్యలు, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా సీటింగ్
 
 సాక్షి, హైదరాబాద్:  వచ్చే నెల ఒకటిన జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో మాస్‌కాపీయింగ్‌కు అవకాశం లేకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అర్ధరాత్రులు, తెల్లవా రుజామున ఫీజుల చెల్లింపులతో వరుస రెఫరెన్స్ ఐడీలను పొంది, వాటి ఆధారంగా హాల్‌టికెట్లు జనరేట్ అయిన అభ్యర్థులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కమిటీ గుర్తిం చింది. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తమ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు వరుసగా హాల్‌టికెట్లు వచ్చేలా, ఒకే దగ్గర కూర్చొని భారీగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడేలా పన్నిన కుట్రకు టెట్ కమిటీ అడ్డుకట్ట వేస్తోంది.

రెఫరెన్స్ ఐడీల ఆధారంగా హాల్ టికెట్లను జనరేట్ చేసిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వరుసగా హాల్‌టికెట్లు వచ్చేలా పన్నిన కుట్రలో వేలల్లో అభ్యర్థులున్నట్లు గుర్తించింది. ప్రస్తుతం వారందరికీ పరీక్ష హాల్లో వరుసగా సీట్లు కేటాయించకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. పరీక్ష కేంద్రాలు, వాటిల్లోని రూమ్‌ల వారీగా సీట్లల్లో మార్పు చేసేందుకు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా చర్యలు చేపట్టింది.  రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆన్‌లైన్ ఫీజులను చెల్లించినవారు దాదాపు 8 వేల మంది వరకు ఉన్నారు. సీజీజీ దీనిని మరింత లోతుగా పరిశీలిస్తోంది.

సాధారణంగా అయితే హాల్‌టికెట్ నంబర్  ప్రకారం వారందరూ వివిధ రూమ్‌ల్లో వరుసగా కూర్చోవాలి. కానీ, మాస్ కాపీయింగ్ కోసం మోసపూరితంగానే కోచింగ్ కేంద్రాలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాయన్న ఆరోపణలు, అనుమానాలున్న నేపథ్యంలో వారిని వరుసగా కాకుండా పరీక్ష కేంద్రాల వారీగా, వేర్వేరు రూమ్‌లలో కూర్చోబెట్టేలా సీటింగ్ అరేంజ్‌మెంట్‌ను జంబ్లింగ్ చేసి మారుస్తోంది.  దీంతో కోచింగ్ కేంద్రాల ఆటలుసాగవని, పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి వెల్లడించారు. మరోవైపు వరుస హాల్‌టికెట్ల జనరేషన్‌పై సీజీజీకి విద్యాశాఖ నోటీసు జారీ చేసి వివరణ కోరింది. తదుపరి చర్యలను పక్కాగా చేపట్టాలని ఆదేశించింది. మే 1వ తేదీన జరగనున్న ఈ పరీక్షకు 3.74 లక్షల మంది హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30  నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement