రెండు నిమిషాల్లో చోరీ | Sakshi
Sakshi News home page

రెండు నిమిషాల్లో చోరీ

Published Wed, Dec 28 2016 1:46 AM

రెండు నిమిషాల్లో చోరీ - Sakshi

షట్టర్‌ పగుల గొట్టి రూ.3.31లక్షలు అపహరణ

రాంగోపాల్‌పేట్‌: రెండు షాపుల షట్టర్లను పగుల గొట్టి రూ.3.31లక్షల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగంపూరకు చెందిన ఖాలిద్‌ ఏఆర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో హోల్‌సేల్‌ రెడీమేడ్‌ దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. మల్లేపల్లికి చెందిన ఇక్బాల్‌ అదే ప్రాంతంలో ఆర్‌కే ట్రేడర్స్‌ పేరుతో హోల్‌సేల్‌ దుకాణం ఏర్పాటు చేశాడు. మంగళవారం తెల్లవారు జామున నలుగురు వ్యక్తులు దుకాణాల తాళాలు పగులగొట్టి చోరాలకు పాల్పడ్డారు. ఏఆర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌లో రూ.2.96 లక్షలు, ఆర్కే ఎంటర్‌ ప్రైజెస్‌లో రూ.35వేల నగదు అపహరణకు గురయ్యాయి. ఉదయం స్థానికులు షట్టర్‌లు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ మురళి కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి  ఆధారాలు సేకరించారు.

క్షణాల్లో పని పూర్తి
ఈ ఘటనలో నలుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు కేవలం రెండు నిమిషాల్లోనే తమ పనిపూర్తి చేసుకోవడం గమనార్హం. ఉదయం సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించిన పోలీసులు నిందితులు 4.48 నిమిషాలకు వచ్చి 4.50 నిమిషాలకు బయటికి వెళ్లినట్లు గుర్తించారు.

Advertisement
Advertisement