'వాళ్లపై కేసులు పెడితే జైళ్లు చాలవు' | telangana minister indrakaran reddy comments on indiramma scheme | Sakshi
Sakshi News home page

'వాళ్లపై కేసులు పెడితే జైళ్లు చాలవు'

Mar 21 2016 10:42 PM | Updated on Aug 11 2018 8:06 PM

'ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకుగాను 250 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు..ఇది ఎవరి పాపం..ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టితే జైళ్లు సరిపోవు' అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సాక్షి, హైదరాబాద్: 'ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకుగాను 250 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు..ఇది ఎవరి పాపం..ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టితే జైళ్లు సరిపోవు' అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నేరుగా భాగస్వాములయ్యారు..ఇండ్లు కట్టకముందే బిల్లులు తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం శాసనసభలో విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. లక్షా 70 వేల ఇందిరమ్మ ఇళ్లను సీబీసీఐడీ పరిశీలిస్తే లక్షా 20 వేల ఇళ్లు కట్టినవేనని తేలిందన్నారు. వీటికి సంబంధించి రూ.273..13 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించామని, మిగిలిన బకాయిలను సైతం చెల్లిస్తామన్నారు.

సీబీసీఐడీ నివేదిక వచ్చిన తర్వాత మిగిలిన ఇళ్లకు చెల్లిస్తామన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించలేదని డబుల్ బడ్రూం ఇళ్ల పథకంపై అనుమానాలు అవసరం లేదన్నారు. రూ.1735 కోట్ల హడ్కో రుణంతో 2016-17లో 2లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఇప్పటికే టెండర్లను పిలిచామని, అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. డబుల్ బడ్రూం ఇళ్ల లబ్ధిదారుల నుంచి మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్ నగరంలో 1.51లక్షల ఇళ్లకు సరిపడ స్థలాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 382 ఎకరాలు, జీహెచ్‌ఎంసీ వెలుపల 299 ఎకరాలను గుర్తించామన్నారు. కాగా..ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టితే జైళ్లు సరిపోవు అని మంత్రి చేసిన వ్యాఖ్యాలను కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలను తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement