సోలార్ వెలుగులు | solar power plants at gandhi,osmania hospitals | Sakshi
Sakshi News home page

సోలార్ వెలుగులు

Jun 4 2014 1:40 AM | Updated on Jun 13 2018 8:02 PM

సోలార్ వెలుగులు - Sakshi

సోలార్ వెలుగులు

గంటల తరబడి విద్యుత్ కోతలు.. రూ.లక్షల్లో నెలసరి విద్యుత్ చార్జీలు.. వెరసి ప్రభుత్వ ఆస్పత్రులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి.

- గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు
 - ఆదిత్య గ్రీన్ ఎనర్జీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

 సాక్షి, సిటీబ్యూరో : గంటల తరబడి విద్యుత్ కోతలు.. రూ.లక్షల్లో నెలసరి విద్యుత్ చార్జీలు.. వెరసి ప్రభుత్వ ఆస్పత్రులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఈ కష్టాల నుంచి ఆస్పత్రులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఆస్పత్రుల్లోనే సూర్యరశ్మితో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కోతలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది.

ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, సికింద్రాబాద్‌లోని గాంధీ జనరల్ ఆస్పత్రి, నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రుల భవనాలపై 400 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ పలకలను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. కేంద్రప్రభుత్వం దీనికి ఆర్థిక సహాయం అందిస్తుండంగా... లాథోర్‌కు చెందిన ఆదిత్యగ్రీన్ ఎనర్జీ సంస్థ పనులు దక్కించుకుంది. సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.5.50ల చొప్పున చెల్లించి కొనుగోలు చేయనుంది. ఆస్పత్రి అవసరాలు తీరగా మిగిలిన విద్యుత్‌ను ఇతరులకు విక్రయించనుంది.
 
గాంధీలో 50 శాతం పనులు పూర్తి ...

గాంధీ ఆస్పత్రిలో 1065 పడకల సామర్థ్యం ఉంది. ఓపీకి ప్రతి రోజూ 2000 మంది రోగులు వస్తుండగా, ఇన్‌పేషంట్ వార్డుల్లో నిత్యం 1500 మంది చికిత్స పొందుతుంటారు. ప్రతి రోజూ 150 శస్త్రచికిత్సలు చేస్తుంటారు. నెలకు రూ.25 నుంచి 30 లక్షల వరకు విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ఇది ఆస్పత్రికి భారంగా మారుతోంది. ఈ వ్యయం, కోతల నుంచి బయటపడేందుకు రూ.3.5 కోట్ల వ్యయంతో ఆస్పత్రిలో 400 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఆస్పత్రి అవసరాల కోసం వినియోగించనున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు నెలసరి విద్యుత్ ఖర్చు కూడా తగ్గించవచ్చు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి అయ్యాయి.

త్వరలో ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో ...
ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సుమారు 1100 పడకల సామర్థ్యం కలిగుంది. ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజూ 2500 మంది వస్తుండగా, ఇన్‌పేషంట్ వార్డుల్లో నిత్యం 2000 మంది చికిత్స పొందుతుంటారు. ఇక్కడ నిత్యం 200 శ స్త్రచికిత్సలు అవుతుంటాయి. ప్రతి నెలా రూ.25 లక్షలకుపైగా విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. 350 పడకల సామర్థ్యం కలిగిన నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి ప్రతి నెలా రూ. లక్షన్నరకుపైగా విద్యుత్ బిల్లు వస్తోంది. ఈ బిల్లులు ఆస్పత్రులకు భారంగా మారుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో 400 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను త్వరలో ఏర్పాటు చేసి, కోతల నుంచి రోగులను కాపాడాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement