స్నాచర్..టైర్రర్ | Snatcher .. tairrar | Sakshi
Sakshi News home page

స్నాచర్..టైర్రర్

Nov 3 2015 12:52 AM | Updated on Sep 5 2018 9:45 PM

స్నాచర్..టైర్రర్ - Sakshi

స్నాచర్..టైర్రర్

జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో సోమవారం నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు వీరంగం సృష్టించారు.

రెచ్చిపోయిన గొలుసు దొంగలు
నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్
ఆటోనగర్‌లో సీసీటీమ్స్ కాల్పులు
సరూర్‌నగర్, అల్వాల్, టోలీచౌకిల్లోనూ ఘటనలు..
తొమ్మిది తులాల బంగారు ఆభరణాలతో పరారీ

 
జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో సోమవారం నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు వీరంగం సృష్టించారు. ఎల్‌బీనగర్ పరిధిలోని ఆటోనగర్‌లో అనురాధ అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా..ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కొనేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. ఇది గమనించిన ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీమ్స్) కానిస్టేబుళ్లు రవిశంకర్, నరేందర్ వారిని వెంబడించగా బైక్‌పై పారిపోయారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో కానిస్టేబుళ్లు కాల్పులు కూడా జరిపారు. అయినా చైన్‌స్నాచర్లు తప్పించుకున్నారు. సరూర్‌నగర్, అల్వాల్, టోలీచౌకి ఫ్లైఓవర్ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో బాధితులు తొమ్మిది తులాల బంగారు ఆభరణాలను కోల్పోయారు.     - సాక్షి, సిటీబ్యూరో
 
 సరూర్‌నగర్‌లో...
చైతన్యపురి: హుడాకాంప్లెక్స్‌లో నివాసముండే డి.సుమతి(48) సోమవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లివస్తుంది. అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న బైకును గమనించింది. చీరకొంగు భుజాలపై వేసుకుంటుండగా బైకుపై వెనుక కూర్చున్న అగంతకుడు ఆమె మెడలోని బం గారు పుస్తెలతాడును లాగాడు. దీంతో అప్రమత్తమైన ఆమె గట్టిగా పట్టుకోగా పుస్తె, లక్ష్మిరూపు కిందపడిపోగా, మూడు తులాల గొలుసు దుండగుల చేతికి చిక్కింది. బాధితురాలు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని డీఐ సునిల్ తెలిపారు.
 
అల్వాల్‌లో...
 అల్వాల్: గోల్నాక అల్వాల్‌కు చెందిన ఇందిర (55) సోమవారం ఉదయం టెంపుల్ అల్వాల్‌లో ఉన్న తన టెలిఫో న్ బూత్ వైపు నడుచుకుంటు వెలుతుండగా, వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని అగంతకులు ఇందిర మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కొని ముందుకు పరిగెత్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ద్విచక్ర వాహనంపై పారిపోయారు. కొద్ది దూరం వెళ్లాక నిందితుడు బం గారు గొలుసుకు ఉన్న పుస్తెలను తొలగించి రోడ్డుపై పడవేసి వెళ్లాడు. తెలుపు రంగు టీషర్ట్, షార్ట్ ధరించి ఉన్నాడని 50 సంవత్సరాల వయసు కలిగి ఉండవచ్చని బాధితురాలు అల్వాల్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

 టోలిచౌకి ఫ్లైఓవర్‌పై...
 గోల్కొండ: గచ్చిబౌలికి చెం దిన సంపత్‌రావు ఆదివారం రాత్రి పది గంటల ప్రాం తంలో తన భార్య వరలక్ష్మితో కలిసి పురానాపూల్‌లోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే సంపత్ టోలీచౌకి ఫ్లైఓవర్‌పై నుంచి షేక్‌పేట్ నాలావైపు వెళుతుండగా రుమాన్ హోటల్ ఎదురుగా కొందరు యువకులు గుమిగూడి వాగ్వావాదం చేసుకుంటున్నారు.
 ఆ గుంపునకు సమీపంలో వచ్చి సంపత్‌రావు బైక్ వేగాన్ని తగ్గించాడు. అదే సమయంలో వెనక నుంచి పల్సర్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు వరలక్ష్మి మెడలోని నాలుగు తులాల బంగారు మంగళ సూత్రాన్ని లాక్కొని పరార య్యారు.
 దీంతో హతాషుడైన సంపత్‌రావు బైక్ వేగాన్ని పెంచి వారిని వెంబడించాడు. అక్కడున్న ఇద్దరు యువకులు కూడా పల్సర్‌ను వెంబడించినా లాభం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement