నయీమ్ కేసులో సిటీ మాజీ మంత్రి! | Skeletons come tumbling out as Nayeem's death takes political hue | Sakshi
Sakshi News home page

నయీమ్ కేసులో సిటీ మాజీ మంత్రి!

Aug 13 2016 2:40 AM | Updated on Oct 16 2018 9:08 PM

నయీం కేసులో ఇప్పటికే పోలీసులు, పలువురు ప్రజాప్రతినిధుల పేర్లు వినబడుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌కి చెందిన మాజీ మంత్రి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

సాక్షి, హైదరాబాద్: నయీం కేసులో ఇప్పటికే పోలీసులు, పలువురు ప్రజాప్రతినిధుల పేర్లు వినబడుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌కి చెందిన మాజీ మంత్రి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సదరు మాజీ మంత్రికి నయీంతో సంబధాలున్నట్టు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. అయితే ఆ మంత్రి ఎవరుంటారన్న చర్చ ఇప్పుడు నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది.
 
టెక్ మధు పేరు చర్చకు...

నయీం కేసులో టెక్ మధు అలియాస్ శ్రీనివాసరెడ్డి పేరు చర్చల్లోకి వచ్చింది. వనస్థలిపురం పోలీసులు నమోదు చేసిన నయీం కేసులో టెక్ మధును 16వ నిందితుడిగా చేర్చారు. నక్సలైట్ల కోసం రాకెట్‌లు, రాకెట్ లాంఛర్లను సిద్ధం చేసేందుకు 2003లో చెన్నైలోని అంబత్తూర్‌లో ఓ పరిశ్రమను స్థాపించాడు. రాకెట్ లాంఛర్స్ వన్, రాకెట్ లాంఛర్స్ టూ అనే రెండు ప్రాజెక్టులను మొదలుపెట్టాడు. 600 రాకెట్ లాంఛర్లను సిద్ధం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు తరలించాడు.

మావోయిస్టు పార్టీ ఆదేశాల మేరకు 1,550 రాకెట్లు, 40 రాకెట్ లాంఛర్లు సిద్ధం చేశాడు. దర్శికి 400, కందుకూరుకు 200, మహబూబ్‌నగర్‌కు 600, కడపకు 300 రాకెట్ లాంఛర్లను సరఫరా చేశాడు. అయితే 2006 నవంబర్ 4న అప్పటి వరంగల్ రేంజ్ డీఐజీ రవిగుప్తా, ఎస్‌పీ సౌమ్యమిశ్రా ముందు భార్య సుధారాణి అలియాస్ వసంతతో వచ్చి లొంగిపోయాడు. అప్పటి నుంచి జనజీవన స్రవంతిలో ఉన్న టెక్ మధు పేరు తాజాగా నయీం కేసులో తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement