బీజింగ్: అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు చైనా మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. వీ ఫెంఘ్, లి షాంగ్ఫులకు ఈ శిక్ష రెండేళ్ల తర్వాత అమలుకానుందని అధికార వార్తా సంస్థ జిన్హుమా గురువారం వెల్లడించింది. ఈ కాలంలో వీరి ప్రవర్తనను బట్టి, మరణ శిక్షను యావజ్జీవంగా మార్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
2018–23 సంవత్సరాల్లో వీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత కొన్ని నెలలపాటు లి రక్షణ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. వీ ఫెంఘ్పై లంచాలు తీసుకున్న ఆరోపణలు, లి షాంగ్ఫుపై లంచాలు తీసుకోవడంతోపాటు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో, 2024లో వీరిద్దరినీ అధ్యక్షుడు జిన్పింగ్ పదవి నుంచి, అధికార కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తొలగించారు. జిన్ పింగ్ సారథ్యంలో పనిచేసే సెంట్రల్ మిలటరీ కమిషన్ నుంచి కూడా ఉద్వాసన పలికారు. అంతకుముందు, వీరిద్దరూ చైనా ఆర్మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ముఖ్యమైన రాకెట్ ఫోర్స్కు చీఫ్గా ఉన్నారు. కాగా, జిన్పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక అమలు చేసిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో పలువురు సైనిక జనరళ్లు సహా కనీసం 10 లక్షల మంది అధికారులు శిక్షలకు గురవడం గమనార్హం.


