కేసులు సరే.. అధికారులేరీ? | Shortage of officers in the CID investigation | Sakshi
Sakshi News home page

కేసులు సరే.. అధికారులేరీ?

Jun 8 2017 3:28 AM | Updated on Nov 9 2018 5:56 PM

రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించే కేసులన్నీ నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ)కు వెళ్తాయి.

- సీఐడీలో దర్యాప్తు అధికారుల కొరత
ఏపీకి అధికారులను రిలీవ్‌ చేయడంతో సమస్య మరింత తీవ్రం
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించే కేసులన్నీ నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ)కు వెళ్తాయి. అయితే సీఐడీ మాత్రం అధికారుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సీఐడీలో ఒక అద నపు డీజీపీ, నలుగురు ఐజీలు, ఆరుగురు డీఐజీలు, 8 మంది ఎస్పీలు, 14 మంది అదనపు ఎస్పీలుండాలి. కానీ ప్రస్తుతం సీఐడీలో ఒక అదనపు డీజీపీ, ఒక ఐజీ, ఒక ఎస్పీ మాత్రమే ఉన్నారు. దీంతో సంచలనాత్మక కేసుల విచారణ, వాటి దర్యాప్తు మానిటరింగ్‌.. ఇలా అనేక అంశాలపై చేతులెత్తేసే పరిస్థితి. కాస్తో కూస్తో ఉన్న సిబ్బందితో నెట్టుకొస్తున్న సీఐడీకి ఇటీవల పోలీస్‌ శాఖ మరో షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజనలో ఏపీకి అలాట్‌ అయిన పలువురు అధికారులను రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో సీఐడీలో ఇప్పటివరకు పనిచేసిన ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎ స్పీలు రిలీవ్‌ అయి వెళ్లిపోతున్నారు.

మరో వైపు గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో అదనపు ఎస్పీ సస్పెండ్‌ అయ్యారు. ఇక మియాపూర్‌ స్కాం కేసుతోపాటు ఎంసెట్‌ స్కాం, బోధన్‌ స్కాం.. కేసులు కూడా ఇప్పుడు రిలీవ్‌ కాబో తున్న అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ అధికారులు రిలీవ్‌ అయితే ఈ కేసుల్లో దర్యాప్తు పరిస్థితి, వాటి పురోగతి ఏంటన్న దానిపై ఉన్నతాధికారుల్లో ఆందో ళన నెలకొంది. ఉన్న డీఎస్పీలతో దర్యాప్తు చేయించాలని చూస్తున్నా.. వాళ్లకు పాత కేసులే పీకల వరకు ఉన్నాయి. పైగా వారిని మానిటర్‌ చేసేందుకు నేరుగా సీఐడీ అదనపు డీజీపీయే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కేసుల దర్యాప్తు, మరో వైపు అడ్మిన్‌ వ్యవహారాలు, ఆర్థిక నేరాలు, సైబర్‌ క్రైమ్, క్రైమ్‌ రికార్డ్స్‌బ్యూరో.. ఇలా అన్ని విభాగాలను సీఐడీ అదనపు డీజీపీయే చూసుకోవాల్సిన పరిస్థితి. పదోన్నతులు ప్రక్రియ పూర్తయితే కొంత మంది అధికారులను సీఐడీకి తీసుకుందామన్నా ఆ ప్రక్రియ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి వెళ్తోంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పోలీస్‌ అధికారులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement