
పరిశ్రమలకు బాసట
రాష్ట్రంలో పరిశ్రమలకు ఊతమివ్వడంతోపాటు కొత్త పరిశ్రమల స్థాపనపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది.
బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి రూ.1165.74 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమలకు ఊతమివ్వడంతోపాటు కొత్త పరిశ్రమల స్థాపనపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా బడ్జెట్లో ప్రణాళిక పద్దులో రూ.1165.74 కోట్లు కేటాయించిం ది. గ్రామీణ చిన్న తరహా పరిశ్రమలకు రూ.832.74 కోట్లు, ఆహార నిల్వలు, గిడ్డంగులకు రూ.188.13 కోట్లు, చేనేత జౌళి శాఖకు రూ.134 కోట్లు కేటాయిం చింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్(టీఎస్ఐఐసీ)కు రూ.100 కోట్లు కేటాయించింది. సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలకు ఇన్సెంటివ్ రూపంలో చెల్లించాల్సిన రూ. 638 కోట్లు చెల్లించేం దుకు నిర్ణయించింది.
బడ్జెట్లోనే అందుకు నిధులు ప్రతిపాదించింది. పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీలు అందించేందుకు రూ. 100 కోట్లు కేటాయించింది. హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రూ. 90 కోట్లు ప్రతిపాదించింది. రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు ఇతర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వరంగల్లో టెక్స్టైల్ పార్కు, హైదరాబాద్లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ను ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. మెదక్ జిల్లాలో 12,365 ఎకరాల్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
అభివృద్ధికి మార్గం...
‘తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి రేటు 2012-13లో మైనస్ 0.9 శాతానికి పడిపోయింది. 2013-14లో కొద్దిగా పెరిగి 2.7 శాతానికి పెరిగింది. ఇంకా చాలా ప్రగతి సాధించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం అమలుచేస్తుంది. కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఛేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం ’ అని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల తన ప్రసంగంలో ప్రస్తావించారు. సింగరే ణి ద్వారా విదేశాలలో బొగ్గు గనులను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ.97.51 కోట్లు కేటాయించింది. పేద కార్మికులకు ఉన్న రుణాలను లక్ష రూపాయాల వరకు మాఫీ చేయనుంది.