సిటీ బస్సుల రూటు మళ్లింపు

సిటీ బస్సుల రూటు మళ్లింపు


సాక్షి,సిటీబ్యూరో: కోఠి ఉమెన్స్ కాలేజ్ వద్ద ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆ రూట్‌లో వెళ్లే పలు బస్సులను దారిమళ్లించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ పురుషోత్తమ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులను చాదర్‌ఘాట్, రంగమహల్ చౌరస్తా,పుతిలీబౌలీ మీదుగా నడుపనున్నట్లు పేర్కొన్నారు. హయత్‌నగర్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో వచ్చే 158, 187,217,218/218ఎల్,225 రూట్‌లకు చెందిన బస్సులు ప్రస్తుతం కోఠీ విమెన్స్ కాలేజ్ మీదుగా కొండాపూర్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు వైపు రాకపోకలు సాగిస్తున్నాయి.



ప్రతి రోజు ఉమెన్స్ కాలేజ్ వద్ద ఉదయం,సాయంత్రం ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయి. తరచుగా ట్రిప్పులు రద్దవుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. దీన్ని దష్టిలో ఉంచుకొని గ్రేటర్ ఆర్టీసీ కోఠీ ఉమెన్స్ కాలేజీ వరకు వెళ్లకుండా చాదర్‌ఘాట్ నుంచి రంగమహల్ చౌరస్తా మీదుగా వెళ్లేటట్లు రూట్ మళ్లించింది.ఏసీ బస్సులు మినహా మిగతా 109 ఆర్డినరీ, మెట్రో డీలక్స్,మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఈ కొత్త రూట్‌లో రాకపోకలు సాగిస్తాయి. ఈ బస్సులు ప్రతి రోజు సుమారు 762 ట్రిప్పులు తిరుగుతాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top