
శివరాత్రికి ముస్తాబైన శైవక్షేత్రాలు
జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 15లో ఉన్న సీతారామ స్వామి ఆలయంలో ఆవరణలోని శివాలయంలో వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
బంజారాహిల్స్,
మహాశివరాత్రి వేడుకలకు శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. గురువారం జరగనున్న శివరాత్రి వేడుకల సందర్భంగా ఆయా ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలిరానుండటంతో ఇప్పటికే సౌకర్యాలు కల్పించారు. శివాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలదండలతో శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. ఆలయాల్లో భక్తుల సౌకర్యార్ధం బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎండలు మండిపోతుండటంతో కొన్ని చోట్ల చలవ పందిళ్లు వేశారు. చాలా ఆలయాల్లో శివపార్వతుల కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. రాత్రి జాగరణ చేసేందుకు పలు ఆలయాల్లో ప్రత్యేక భజనలు, భక్తిగీతాలపన కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
శివరాత్రి వేడుకలు ఇలా...
శ్రీనగర్కాలనీలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో శివరాత్రి వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.బాలాజీ తెలిపారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకే స్వామి వారికి అభిషేకంతో పర్వదిన వేడుకలు మొదలవుతాయన్నారు.
ఫిలింనగర్లోని దైవ సన్నిధానంలో కొలువైన భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని కేర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శివాలయంలో వేడుకల కోసం సన్నాహాలు పూర్తయ్యాయి. సుమారు 50 వేల మంది భక్తులు హాజరౌతారని అంచనా వేస్తున్నారు.
బంజారాహిల్స్ రోడ్నెంబర్ 12లోని కమాన్ను ఆనుకొని ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలోని శివాలయంలో శివరాత్రి వేడుకలు కన్నలపండువగా నిర్వహించనున్నట్లు ఆలయ ఇంచార్జ్ పి.వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.
జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 15లో ఉన్న సీతారామ స్వామి ఆలయంలో ఆవరణలోని శివాలయంలో వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పంజగుట్ట నిమ్స్ ఆసుపత్రిని ఆనుకొని ఉన్న భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.పంజాగుట్ట దుర్గానగర్కాలనీలో కొలువైన కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఖైరతాబాద్లోని వాసవీ సేవా కేంద్రంలో శివరాత్రి వేడుకలు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు.