జూలై 8 నుంచి ప్రపంచ తెలంగాణ మహాసభలు


పంజగుట్ట (హైదరాబాద్) : తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియచెప్పేందుకు అమెరికన్ తెలంగాణ సంఘం(ఆటా) కృషి చేస్తుందని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జులై 8 నుంచి 10వ తేదీ వరకు అమెరికాలోని డెట్రాయిట్ మహానగరంలో 'ప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలు' నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. సోమవారం లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో మహాసభల పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వాహకులు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ... అమెరికాలోని 25 ప్రాంతీయ తెలంగాణ సంఘాలు కలిసి నెల క్రితమే ఆటా ఏర్పడిందని, ఇంత తక్కువ సమయంలోనే ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నామన్నారు. 

 

ఈ సభలకు 25 దేశాల నుంచి తెలంగాణ, తెలుగువారు సుమారు 7 వేల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. కేవలం డెట్రాయిట్ నగరంలోనే 8 వేలు, అమెరికా మరికొన్ని రాష్ట్రాల్లో సుమారు 20 వేలమంది తెలంగాణ కుటుంబాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై రెండేళ్లకోసారి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి రెడ్డి చింతలపాని, రమాదేవి నీలారపు, కె.పద్మజారెడ్డి, బి.రామచంద్రారెడ్డి, రావు నెరుసు తదితరులు పాల్గొన్నారు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top