మద్యం మత్తులో ఉన్న పోలీసులు ఓ యువకునిపై, వృద్ధ దంపతులపై దాడి చేశారు.
హైదరాబాద్ సిటీ: మద్యం మత్తులో ఉన్న పోలీసులు ఓ యువకునిపై, వృద్ధ దంపతులపై దాడి చేశారు. ఈ సంఘటన మాదన్నపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... శివ, రాజు అనే ఇద్దరు కానిస్టేబుళ్లు అనిల్ అనే వ్యక్తికి నాన్ బెయిలబుల్ వారెంట్ అందజేసేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే వారికి అనిల్ సోదరుడు అజయ్ కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇది అన్యాయమని ప్రశ్నించినందుకు అతన్ని చితకబాదారు. అంతటితో ఆగకుండా అడ్డువచ్చిన అతని తల్లిదండ్రులపై కూడా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురినీ స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుళ్ల దౌర్జన్యంపై స్థానికులు బుధవారం అర్థరాత్రి మాదన్నపేట పోలీస్స్టేషన్ను ముట్టడించారు.