రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ‘దారి’ దోపిడీ..!

రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ‘దారి’ దోపిడీ..! - Sakshi


సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై

చార్జీల మోత

ప్రత్యేక రైళ్లలో 20% అదనపు వడ్డింపు

టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనం

రెట్టింపు చార్జీలతో వాయిస్తున్న ప్రైవేట్‌ బస్సులు

హైదరాబాద్‌ నుంచి పండుగ కోసం వెళ్లేవారితో భారీగా రద్దీ...

 కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

మహిళలు, వృద్ధులు, పిల్లలకు తీవ్ర అవస్థలు  




సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ, సెలవుల కోసం స్వస్థలాలకు వెళుతున్న ప్రయాణికులపై చార్జీల మోత మోగిపోతోంది. రైలు, బస్సు అనే తేడా లేకుండా నిలువు దోపిడీ జరుగుతోంది. ప్రైవేటు బస్సుల్లోనైతే ముక్కు పిండి మరీ రెండు మూడింతలు చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. మొత్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో పాటు రైల్వే, ఆర్టీసీలు సైతం ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకుంటు న్నాయి. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వివిధ ప్రాంతాలకు రాకపో కలు సాగించే ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీ లపై 20 నుంచి 25% వరకు రైల్వే అదనపు వసూళ్లకు దిగింది. తెలంగాణ ఆర్టీసీ సైతం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా 50% అదనపు మోత మోగిస్తోంది. 200 కిలోమీటర్లు దాటి వెళ్లే అన్ని బస్సుల్లో సాధారణ చార్జీలపైన ఈ అదనపు చార్జీలను వసూలు చేస్తోంది. ఇక హైదరాబాద్‌ నుంచి ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్‌ కార్లు వంటివి అందినకాడికి వసూలు చేస్తున్నాయి.



రెండు రోజులుగా..

సంక్రాంతి సందర్భంగా రెండు రోజులుగా జనం సొంతూళ్లకు వెళుతున్నారు. పాఠశాల లకు సెలవులు ప్రకటించడంతో బుధవారం ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతా లకు వెళ్లే రైళ్లు, బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. ఈ రద్దీని రవాణా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి.



రైల్వే ‘ప్రత్యేక’మోత

దక్షిణ మధ్య రైల్వే ‘స్పెషల్‌’ఫేర్‌ పేరుతో దోపిడీకి దిగింది. సాధారణ చార్జీలపై 20 నుం చి 25% అదనంగా వసూలు చేస్తోం ది. సాధా రణంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల నుంచి 120 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సంక్రాం తి రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ, విజయ వాడ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్‌ తదితర ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లు ప్రయాణికుల రద్దీకి సరి పోవడం లేదు. ఇక ప్రైవేట్‌ బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో రెట్టింపు చార్జీలను దృష్టిలో ఉంచు కుని రైళ్లను ఆశ్రయించేవారికి ఇక్కడా మోత తప్పడం లేదు.






ఆర్టీసీలోనూ మోత..

సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది.  హైదరాబాద్‌ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే 750 ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ జిల్లాలకు 2,450 ప్రత్యేక  బస్సులు నడుపుతున్నారు. వీటిలో 200 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే వాటిలో సాధారణ చార్జీలు తీసుకుంటూ.. దాటితే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు.





ప్రైవేట్‌ బస్సుల నిలువు దోపిడీ

సంక్రాంతి రద్దీని ప్రైవేటు ట్రావెల్స్‌ భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఏకంగా రెండు మూడింతలు చార్జీలు వసూలు చేస్తున్నాయి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఒక్కో ట్రావెల్స్‌ సంస్థ ఒక్కో విధంగా చార్జీలతో దోచుకుంటున్నాయి. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రోజూ సుమారు 1,000 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. వాటన్నింటిలోనూ భారీగా టికెట్‌ ధరలు పెంచేశారు.



చుక్కలు చూపుతున్న రైళ్లు..

ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. జనరల్‌ బోగీల్లో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. బుధవారం సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు బయలుదేరారు. రిజర్వేషన్‌ లభించని వారంతా జనరల్‌ బోగీలపైనే ఆధారపడటంతో నిలబడేందుకూ చోటు లేకుండా పోయింది. దీంతో రైలు ప్లాట్‌ఫామ్‌ మీద పూర్తిగా ఆగకముందే బోగీని అందుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భారీగా ప్రయాణికులు చేరుకుంటుండడంతో రైల్వే స్టేషన్లలో తోపులాటలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలను తీసుకుని ప్రయాణిస్తున్నవారి అగచాట్లు వర్ణనాతీతం.



నరకం కనిపిస్తోంది

‘‘రైల్వేస్టేషన్, రైళ్లలో పరిస్థితి చూస్తే నరకం కనిపిస్తోంది. ఏటా ప్రయాణికుల రద్దీని అధికారులు ప్రత్యక్షంగా చూస్తున్నా... ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారు. ప్రయాణంలో అను భవిస్తున్న ఇబ్బంది పండుగ ఆనందాన్ని దూరం చేస్తోంది..’’ – హేమంత్, ప్రయాణికుడు



మహిళలు, పిల్లల బాధ పట్టించుకునేదెవరు?

‘‘రైలు బోగీల్లో పడరాని పాట్లు పడుతున్నాం. పసిపిల్లలతో వస్తున్న మహిళలు రైలెక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు. చిన్న పిల్లలు గొంతెండిపోయేలా ఏడుస్తుంటే చాలా బాధేస్తోంది. పిల్లతల్లుల కోసం పండుగ సమయాల్లో ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయాలి..’’    

 – పద్మ, ప్రయాణికురాలు


Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top