breaking news
Increasing charges
-
మళ్లీ పేలనున్న సెల్ బాంబ్!
న్యూఢిల్లీ: టెలికం సేవల మార్కెట్లోకి రిలయన్స్ జియో రాకతో ఎక్కువగా మురిసిపోయింది సగటు వినియోగదారుడేనని అనడంలో సందేహం లేదు. కానీ, మారిన పరిస్థితులతో ఇప్పుడు అదే వినియోగదారుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి...! కేంద్రానికి భారీ బకాయిలు కట్టాల్సి ఉన్న టెలికం కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు చార్జీలు పెంచడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం మినహా ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. ఒకవైపు 4జీ నెట్వర్క్ విస్తరణపై భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి.. మరోవైపు జియోకు వినియోగదారులు చేజారిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి.. ఇంకోవైపు కేంద్రానికి భారీ బకాయిలు చెల్లించక తప్పని పరిస్థితి.. అందుకే గత డిసెంబర్లో ఏకంగా 42 శాతం వరకు చార్జీలను పెంచేసిన సంస్థలు.. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఏడాది కాలంలో మరింత పెంపునకు సిద్ధం అవుతున్నాయి. జియో రాక పూర్వం ఒక జీబీ డేటా వినియోగానికి రూ.200కుపైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మోస్తరు కాల్స్ చేసుకునే వారు కూడా నెలకు రూ.200 వరకు వెచ్చించే వారు. కానీ, 2016లో జియో అడుగుపెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ఉచితంగా ఆరంభించిన జియో భారీగా వినియోగదారులను సొంతం చేసుకుంది. డేటా, కాల్స్ను పరిమితి లేకుండా ఉచితంగా అందించి వినియోగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. జియో దెబ్బకు రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్సెల్, టాటా డొకొమో, టెలినార్ ఇలా అందరూ దుకాణాలను మూతేసుకోవాల్సి వచ్చింది. మూడేళ్లలోనే జియో చందాదారుల సంఖ్యా పరంగా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. జియో విధ్వంసాన్ని తట్టుకోలేక ప్రధాన టెలికం ప్లేయర్లు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ విలీనమైన వొడాఫోన్ ఐడియాగా అవతరించాయి. చివరకు మూడు ప్రైవేటు సంస్థలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం మార్కెట్లో మిగిలాయి. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో గత 20 ఏళ్లకు సంబంధించి స్పెక్ట్రమ్, ఇతర బకాయిల రూపంలో టెల్కోలు ఇప్పుడు కేంద్రానికి రూ.1.47 లక్షల కోట్లను చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్టెల్ రూ.35వేల కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.53 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రభావాన్ని అధిగమించేందుకు వాటి ముందున్న మార్గం చార్జీల పెంపే. అదే జరిగితే డేటాను పొదుపుగా వాడుకోవాల్సిన రోజులు మళ్లీ వచ్చేలా ఉన్నాయి. లేదంటే జేబు నుంచి మరింత ఖర్చు చేయక తప్పదు. రానున్న ఏడాది కాలంలో సగటు వినియోగదారు నుంచి వచ్చే నెలవారీ ఆదాయం(ఏఆర్పీయూ) రెట్టింపు కావచ్చని టెలికం కంపెనీలు అంచనాలు వేసుకుంటున్నాయి. లాభాల్లోకి రావాలంటే పెంచాల్సిందే.. ‘‘2020 చివరికి ఏఆర్పీయూ నెలకు కనీసం రూ.200 స్థాయికి, 2021 నాటికి కనీసం రూ.300కు చేరాల్సి ఉందన్న సంకేతాన్ని ఇచ్చాం. టారిఫ్ల పెంపు వినియోగాన్ని తగ్గించొచ్చేమో కానీ, సంఖ్యపై ప్రభావం చూపించదు’’ అని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. 2019 మార్చి నాటికి ఏఆర్పీయూ రూ.113 స్థాయిలో ఉంది. దీనిపై కంపెనీలకు 18 శాతం నష్టాలు వచ్చాయి. ఏఆర్పీయూ 77 శాతం పెరిగి రూ.200కు చేరుకుంటే అప్పుడు కంపెనీలు లాభాల్లోకి ప్రవేశిస్తాయి. ఆదాయంలో లాభాలు 10 శాతానికి చేరుకుంటాయని కంపెనీల అంచనా. ఇక ఏఆర్పీయూ రూ.300కు చేరుకుంటే కంపెనీల ఆదాయంలో పన్ను అనంతరం లాభాలు 30–40 శాతానికి విస్తరిస్తాయి. అయితే టెలికం నెట్వర్క్పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉన్నందున వాస్తవ లాభాలు తక్కువగానే ఉంటాయన్నది విశ్లేషణ. వచ్చే పలు త్రైమాసికాల్లో ఏఆర్పీయూ రూ.200కు, ఆ తర్వాత కొంత కాలానికి రూ.300కు చేరుకుంటుందని భారతీ ఎయిర్టెల్ విశ్లేషకులకు ఇప్పటికే తెలియజేయడం గమనార్హం. ముఖ్యంగా ఏజీఆర్ బకాయిల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసే పరిస్థితులు తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. కానీ, మార్కెట్లోకి లేటుగా వచ్చిన జియోకు ఈ ఏజీఆర్ భారం ఏమీ లేకపోవడంతో.. టారిఫ్ల పెంపు రూపంలో ఆ సంస్థకు లాభాల వరద పారనుంది. ఐడియా మూసేస్తే.. వొడా–ఐడియా ఒక్కో త్రైమాసికంలో రూ.6వేల కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొంటోంది. గత చార్జీల పెంపు సంస్థకు కలసి రాలేదు. పైగా కేంద్రానికి రూ.53 వేల కోట్ల వరకు కట్టాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఉపశమనం రాకపోతే సంస్థను మూసేయక తప్పదని కుమారమంగళం బిర్లా బహిరంగంగానే సంకేతమిచ్చారు. ఒకవేళ వొడా–ఐడియా దుకాణం బంద్ అయితే, ఈ సంస్థ చందాదారుల్లో (సుమారు 30 కోట్లు) కనీసం సగం మందిని అయినా సొంతం చేసుకోవడం ద్వారా 50 కోట్ల మార్క్ను అధిగమించాలని, 64.6 కోట్ల చందాదారుల లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రణాళికలతో జియో సిద్ధంగా ఉందని తెలుస్తోంది. వొడా–ఐడియా నిష్క్రమణ చందాదారుల పరంగా అటు ఎయిర్టెల్ కూడా కలసి రానుంది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4జీ సేవల్లో లేదు కనుక ఆ సంస్థకు వెళ్లే చందాదారులు తక్కువగానే ఉంటారని అంచనా. -
రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ‘దారి’ దోపిడీ..!
-
రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ‘దారి’ దోపిడీ..!
► సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై చార్జీల మోత ► ప్రత్యేక రైళ్లలో 20% అదనపు వడ్డింపు ► టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనం ► రెట్టింపు చార్జీలతో వాయిస్తున్న ప్రైవేట్ బస్సులు ► హైదరాబాద్ నుంచి పండుగ కోసం వెళ్లేవారితో భారీగా రద్దీ... కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ► మహిళలు, వృద్ధులు, పిల్లలకు తీవ్ర అవస్థలు సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ, సెలవుల కోసం స్వస్థలాలకు వెళుతున్న ప్రయాణికులపై చార్జీల మోత మోగిపోతోంది. రైలు, బస్సు అనే తేడా లేకుండా నిలువు దోపిడీ జరుగుతోంది. ప్రైవేటు బస్సుల్లోనైతే ముక్కు పిండి మరీ రెండు మూడింతలు చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. మొత్తంగా ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు రైల్వే, ఆర్టీసీలు సైతం ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకుంటు న్నాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని వివిధ ప్రాంతాలకు రాకపో కలు సాగించే ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీ లపై 20 నుంచి 25% వరకు రైల్వే అదనపు వసూళ్లకు దిగింది. తెలంగాణ ఆర్టీసీ సైతం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా 50% అదనపు మోత మోగిస్తోంది. 200 కిలోమీటర్లు దాటి వెళ్లే అన్ని బస్సుల్లో సాధారణ చార్జీలపైన ఈ అదనపు చార్జీలను వసూలు చేస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్ కార్లు వంటివి అందినకాడికి వసూలు చేస్తున్నాయి. రెండు రోజులుగా.. సంక్రాంతి సందర్భంగా రెండు రోజులుగా జనం సొంతూళ్లకు వెళుతున్నారు. పాఠశాల లకు సెలవులు ప్రకటించడంతో బుధవారం ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతా లకు వెళ్లే రైళ్లు, బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. ఈ రద్దీని రవాణా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. రైల్వే ‘ప్రత్యేక’మోత దక్షిణ మధ్య రైల్వే ‘స్పెషల్’ఫేర్ పేరుతో దోపిడీకి దిగింది. సాధారణ చార్జీలపై 20 నుం చి 25% అదనంగా వసూలు చేస్తోం ది. సాధా రణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి 120 ఎక్స్ప్రెస్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సంక్రాం తి రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ, విజయ వాడ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్ తదితర ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లు ప్రయాణికుల రద్దీకి సరి పోవడం లేదు. ఇక ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో రెట్టింపు చార్జీలను దృష్టిలో ఉంచు కుని రైళ్లను ఆశ్రయించేవారికి ఇక్కడా మోత తప్పడం లేదు. ఆర్టీసీలోనూ మోత.. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే 750 ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ జిల్లాలకు 2,450 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. వీటిలో 200 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే వాటిలో సాధారణ చార్జీలు తీసుకుంటూ.. దాటితే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ బస్సుల నిలువు దోపిడీ సంక్రాంతి రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఏకంగా రెండు మూడింతలు చార్జీలు వసూలు చేస్తున్నాయి. డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఒక్కో ట్రావెల్స్ సంస్థ ఒక్కో విధంగా చార్జీలతో దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రోజూ సుమారు 1,000 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. వాటన్నింటిలోనూ భారీగా టికెట్ ధరలు పెంచేశారు. చుక్కలు చూపుతున్న రైళ్లు.. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. జనరల్ బోగీల్లో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. బుధవారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు బయలుదేరారు. రిజర్వేషన్ లభించని వారంతా జనరల్ బోగీలపైనే ఆధారపడటంతో నిలబడేందుకూ చోటు లేకుండా పోయింది. దీంతో రైలు ప్లాట్ఫామ్ మీద పూర్తిగా ఆగకముందే బోగీని అందుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భారీగా ప్రయాణికులు చేరుకుంటుండడంతో రైల్వే స్టేషన్లలో తోపులాటలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలను తీసుకుని ప్రయాణిస్తున్నవారి అగచాట్లు వర్ణనాతీతం. నరకం కనిపిస్తోంది ‘‘రైల్వేస్టేషన్, రైళ్లలో పరిస్థితి చూస్తే నరకం కనిపిస్తోంది. ఏటా ప్రయాణికుల రద్దీని అధికారులు ప్రత్యక్షంగా చూస్తున్నా... ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారు. ప్రయాణంలో అను భవిస్తున్న ఇబ్బంది పండుగ ఆనందాన్ని దూరం చేస్తోంది..’’ – హేమంత్, ప్రయాణికుడు మహిళలు, పిల్లల బాధ పట్టించుకునేదెవరు? ‘‘రైలు బోగీల్లో పడరాని పాట్లు పడుతున్నాం. పసిపిల్లలతో వస్తున్న మహిళలు రైలెక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు. చిన్న పిల్లలు గొంతెండిపోయేలా ఏడుస్తుంటే చాలా బాధేస్తోంది. పిల్లతల్లుల కోసం పండుగ సమయాల్లో ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయాలి..’’ – పద్మ, ప్రయాణికురాలు