సంక్రాంతి పండుగ, సెలవుల కోసం స్వస్థలాలకు వెళుతున్న ప్రయాణికులపై చార్జీల మోత మోగిపోతోంది. రైలు, బస్సు అనే తేడా లేకుండా నిలువు దోపిడీ జరుగుతోంది. ప్రైవేటు బస్సుల్లోనైతే ముక్కు పిండి మరీ రెండు మూడింతలు చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. మొత్తంగా ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు రైల్వే, ఆర్టీసీలు సైతం ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకుంటు న్నాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని వివిధ ప్రాంతాలకు రాకపో కలు సాగించే ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీ లపై 20 నుంచి 25% వరకు రైల్వే అదనపు వసూళ్లకు దిగింది. తెలంగాణ ఆర్టీసీ సైతం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా 50% అదనపు మోత మోగిస్తోంది. 200 కిలోమీటర్లు దాటి వెళ్లే అన్ని బస్సుల్లో సాధారణ చార్జీలపైన ఈ అదనపు చార్జీలను వసూలు చేస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్ కార్లు వంటివి అందినకాడికి వసూలు చేస్తున్నాయి.