అక్టోబరులో నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన | Narendra Modi to tour in telangana in the month of october, says dr laxman | Sakshi
Sakshi News home page

అక్టోబరులో నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన

Jul 8 2016 8:24 PM | Updated on Aug 15 2018 2:30 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ నెలలో తెలంగాణలో పర్యటిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ నెలలో తెలంగాణలో పర్యటిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు గంటల పాటు సాగిన తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ నెలలో కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వస్తారని కూడా లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజాందోళనలను చేపట్టాలని కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు.

పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, తెలంగాణ ఇన్ చార్జి కృష్ణదాసు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయలతో సమావేశమయ్యామని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా సమావేశంలో చర్చించామని లక్ష్మణ్ చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు పార్టీ అధిష్ఠానం గుర్తించిందని, తెలంగాణ, ఏపీ, ఒడిషా రాష్ట్రాలలో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు జాతీయ నాయకులకు వివరించామని తెలిపారు. తెలంగాణ సర్కారు కుటుంబ పాలన, పార్టీ ఫిరాయింపులు, ప్రతిపక్షాలను అణగదొక్కడమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement