బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా కేరళను నైరుతి రుతుపవనాలు ఏడో తేదీన తాకే అవకాశముందన్నారు. తర్వాత ఏపీలోకి, అనంతరం తెలంగాణలోకి ప్రవేశిస్తాయన్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వైపు అల్పపీడన ద్రోణి ఏర్పడింది.
దీంతో రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయని, రాష్ట్రంలో వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉండకపోవచ్చన్నారు. ఇక గత 24 గంటల్లో గద్వాల్లో 3, మెదక్, టేకులపల్లిలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గురువారం రామగుండంలో అత్యధికంగా 45, ఆదిలాబాద్లో 44, హైదరాబాద్లో 34.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు రాష్ట్రంలో 20 మంది వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.