‘కుచేలుని’ ఇఫ్తార్ విందు: వేదికపై అపురూప దృశ్యం | Rasheed Karalam kathakali debut | Sakshi
Sakshi News home page

‘కుచేలుని’ ఇఫ్తార్ విందు: వేదికపై అపురూప దృశ్యం

Mar 5 2026 9:52 AM | Updated on Mar 5 2026 9:59 AM

Rasheed Karalam kathakali debut

త్రిశూర్: కళకు మతం అడ్డుకాదని, భక్తికి ఆచారాలు సరిహద్దులు కావని కేరళకు చెందిన ఒక ముస్లిం కళాకారుడు చాటిచెప్పారు. రంజాన్ పవిత్ర మాసంలో కఠిన ఉపవాస దీక్షలో ఉన్న రషీద్ కారళం, బుధవారం సాయంత్రం తన కథాకళి అరంగేట్రానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందు గ్రీన్ రూమ్‌లో ఇఫ్తార్ విందు ముగించి వార్తల్లో నిలిచారు.

కథాకళిలో అత్యంత సంక్లిష్టమైన కుచేలుడి వేషధారణలో ఉంటూనే, అజాన్ పిలుపు వినిపించగానే ఆయన తన దీక్షను విరమించి, నేరుగా రంగస్థలంపైకి అడుగుపెట్టారు. త్రిశూర్ జిల్లా ఇరింజలకుడలోని టౌన్ హాల్ వేదికగా జరిగిన ఈ అపురూప ఘట్టం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడమే కాకుండా, భారతీయ సంస్కృతిలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించింది. ప్రముఖ చిత్రకారుడు మోహన్‌దాస్‌ను సత్కరించేందుకు ‘యువకళా సాహితి’ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ‘కుచేలవృత్తం’ కథాకళి ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శనలో రషీద్ కారళం కుచేలుడి పాత్రను పోషించారు. కథాకళికి అవసరమైన భారీ మేకప్, ఆహార్యంతో సిద్ధమైన రషీద్.. ప్రదర్శన సమయం దగ్గరపడుతున్న తరుణంలోనే ఉపవాసం విరమించాల్సి వచ్చింది. తన గురువు కళానిలయం వినోద్ పర్యవేక్షణలో గత కొన్నేళ్లుగా కఠిన శిక్షణ పొందుతున్న రషీద్‌కు.. ప్రేక్షకుల మధ్య ఈ అరంగేట్రం చేయడం ఒక జీవితకాల స్వప్నం. ఆ కల సాకారమయ్యే క్రమంలో అటు మతపరమైన నిష్ఠను, ఇటు కళాభిమానాన్ని అద్భుతంగా సమన్వయం చేసుకున్నారు రషీద్.

సామాజిక కార్యకర్త అయిన రషీద్ .. ఇరింజలకుడ కథాకళి క్లబ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, యువకళా సాహితి సంయుక్త కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. కేవలం కళాకారుడిగానే కాకుండా 'వీటిలె లైబ్రరీ' (ఇంటి లైబ్రరీ) పేరుతో పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ విశేష ప్రదర్శన సమయంలో రషీద్ కుటుంబ సభ్యులు భార్య రజియా, కుమారుడు షాహిల్, కుమార్తె డాక్టర్ షహానా , మనవరాలు కనల్ కతిర్ గ్రీన్ రూమ్‌లోనే ఉండి ఆయనకు సహకారం అందించారు.

ఇది కూడా చదవండి: బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement