
497 అడుగుల దిగువకు వెళ్దాం!
రాష్ట్ర సాగు, తాగు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్లో లభ్యతగా ఉన్న నీటిని వాడుకునేందుకు కనీస మట్టానికి మరింత దిగువకు వెళ్లాలని తెలంగాణ యోచిస్తోంది.
- సాగర్లో మరింత దిగువకు వెళ్లే యోచనలో తెలంగాణ
- ఇప్పటికే 508 అడుగుల్లో నీటిని తోడుతున్న పరిస్థితి
- శ్రీశైలంలో 775 అడుగులకు వెళ్లాలని యోచన
- దీనిపై 6న కృష్ణాబోర్డుకు లేఖ రాసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగు, తాగు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్లో లభ్యతగా ఉన్న నీటిని వాడుకునేందుకు కనీస మట్టానికి మరింత దిగువకు వెళ్లాలని తెలంగాణ యోచిస్తోంది. కృష్ణా జలాల్లో తన వాటా మేరకు వినియోగం పూర్తయినందున సాగర్లో ఇప్పటికే నిర్ణయిం చిన 503 అడుగుల కనీస నీటిమట్టాన్ని పక్కనపెట్టి 497 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకోవాలని భావిస్తోంది. శ్రీశైలంలోనూ ఇదే రీతిన మరింత దిగువకు వెళ్లి నీటిని తీసుకునే అంశాన్ని తెరపైకి తెస్తోంది. దీనిపై కృష్ణా బోర్డుకు గురువారం (6వ తేదీన) లేఖ రాసే అవకాశం ఉంది.
లభ్యత తక్కువ.. అవసరాలు ఎక్కువ
ఈ ఏడాది కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నా, సాగర్కు మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తెలంగాణ సాగు, తాగు అవసరాలకు నీటి కష్టాలు పెరిగాయి. అవసరాలు హెచ్చుగా ఉండటం, లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల వినతులను దృష్టిలో పెట్టుకొని కృష్ణా బోర్డు.. శ్రీశైలం, సాగర్లలో కనీస మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని పంచేసింది. ఇరురాష్ట్రాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో 785 అడుగుల దిగువకు, సాగర్లో 503 అడుగుల దిగువకు వెళ్లి నీటిని తీసుకునేందుకు అనుమతించింది. ప్రస్తుతం సాగర్ మట్టం 507.9 అడుగులకు చేరింది. శ్రీశైలంలో కనీస నీటి మట్టం 834 అడుగుల దిగువకు వెళ్లి నీటిని వినియోగిం చడంతో అక్కడ ప్రస్తుత మట్టం 804.60 అడుగులకు చేరింది. రెండు ప్రాజెక్టుల్లో 17.6 టీఎంసీల నీళ్లున్నాయి. బోర్డు కేటాయించిన వాటాలో తెలంగాణ కోటా పూర్తవడంతో మిగిలిన 17.6 టీఎంసీలు ఏపీకే దక్కను న్నాయి. దీంతో మరింత దిగువకు వెళ్లాలన్నది తెలంగాణ యోచనగా ఉంది.
12 టీఎంసీలు అవసరం
జూలై వరకు రాష్ట్ర సాగు, తాగునీటికి 12 టీఎంసీల మేర అవసరం కానున్నాయి. ఈ నీరు దక్కాలంటే సాగర్లో 497 అడుగులకు, శ్రీశైలంలో 775 అడుగుల వరకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలంగాణ భావిస్తోంది. ఇందులో 5 టీఎంసీలు సాగర్ ఎడమ కాల్వ కింద రబీ అవసరాలకు, మరో 5.5 టీఎంసీ లు జంట నగరాల తాగునీటి అవసరాలకు, మరో 1.5 టీఎంసీలు నల్లగొండ తాగునీటికి సరిపోతా యని అంటోంది. ఇలా అయితేనే వేసవి గం డం గట్టెక్కుతామని లేదంటే ఇక్కట్లు తప్పవని అంచనా వేస్తోంది. ఈ మేరకు మొత్తం వివరాలను పేర్కొంటూ గురువారం కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇండెంట్ సమర్పించే అవకాశం ఉంది.