ఈ ఏడాది నుంచే కేజీ టు పీజీ | kg to pg education will start this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది నుంచే కేజీ టు పీజీ

Apr 15 2016 2:08 AM | Updated on Aug 15 2018 9:30 PM

ఈ ఏడాది నుంచే కేజీ టు పీజీ - Sakshi

ఈ ఏడాది నుంచే కేజీ టు పీజీ

‘కేజీ టు పీజీ’లో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో 250 రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు
250 రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాం
దళితులకు 100, గిరిజనులకు 50 రెసిడెన్షియల్ పాఠశాలలు
దళిత అమ్మాయిలకు 25, అబ్బాయిలకు 5 డిగ్రీ కాలేజీలు
విదేశాలకు వెళ్లే దళిత, గిరిజన విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూ.20 లక్షలకు పెంపు
ప్రభుత్వ పనులు, పెట్టుబడులు సమకూర్చి దళిత కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తాం
అంబేడ్కర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని వ్యాఖ్య
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో 125 అడుగుల
అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి శంకుస్థాపన

 
సాక్షి, హైదరాబాద్: ‘కేజీ టు పీజీ’లో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో 250 రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని కేజీ టు పీజీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఎంత ఖర్చయినా సరే దళిత విద్యార్థుల కోసం ఈ జూన్ నుంచే 100 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు, గిరిజనులకు 50 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నెలన్నర వ్యవధిలోనే ఉపాధ్యాయులను కూడా రిక్రూట్ చేస్తామన్నారు.

ఉన్నత విద్యావకాశం కల్పించేందుకు దళిత అమ్మాయిలకు 25, అబ్బాయిలకు 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామని... వాటిని విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకుండా సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. మైనారిటీ విద్యార్థులకు 70 రెసిడెన్షియల్ స్కూళ్లను ఇప్పటికే మంజూరు చేశామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

దళిత, గిరిజన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రస్తుతం ఇస్తున్న రూ.10 లక్షల స్కాలర్‌షిప్‌ను రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దళితులు, గిరిజనులు ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. టీఎస్ ప్రైడ్ ద్వారా శిక్షణ పూర్తి చేసిన దళిత యువకులకు ప్రభుత్వ పనులను కాంట్రాక్టుపై ఇస్తామని... అవసరమైన యంత్ర పరికరాలు, పెట్టుబడిని కూడా సమకూర్చి దళిత కాంట్రాక్టర్లను తయారు చేస్తామని చెప్పారు.
 
దళితులకు అద్దెకిచ్చేలా మనసు మార్చుకోండి
దళిత సమాజంలో రావాల్సినంత గుణాత్మక మార్పు ఇంకా రాలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. టెన్త్, ఇంటర్ పూర్తిచేసిన దళిత అమ్మాయిలు డిగ్రీ చదివేందుకు పట్టణాలకు వస్తే కొందరు గదులు అద్దెకు ఇవ్వడం లేదని, అటువంటి సన్నాసులు మనసు మార్చుకోవాలని హితవు పలికారు. దేశానికే కాదు ప్రపంచానికే తన జీవితాన్ని ఆదర్శంగా అందించిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ‘‘అంబేడ్కర్ మనుషుల కోసమే బతికారు. పేదలు, బాధితులు, పీడితులు, దోపిడీకి గురైన వారి పక్షాన ఎలుగెత్తి, గొంతెత్తి నిలబడ్డారు. ద గ్రేటెస్ట్ ఇండియన్ బిరుదు అందుకున్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్. ఆయన స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పునరంకితమవుతుంది..’’ అని పేర్కొన్నారు.
 
అంబేడ్కర్‌కు విశ్వవ్యాప్త ఖ్యాతి: దత్తాత్రేయ
ఐక్యరాజ్యసమితి అంబేడ్కర్ జయంతిని నిర్వహించడం ఆయనకున్న విశ్వవ్యాప్త ఖ్యాతికి అద్దం పడుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన జీవితంతో ముడిపడి ఉన్న ఐదు ప్రాంతాలను కేంద్రం పంచ తీర్థాలుగా అభివృద్ధి చేస్తుందని చెప్పారు. మొదటగా కార్మిక మంత్రిగా ఉన్న అంబేడ్కర్ ఈఎస్‌ఐ ఆసుపత్రులు, ఈపీఎఫ్‌ను ప్రవేశపెట్టారని, ఇప్పుడదే విధానం కార్మికులకు అండగా నిలుస్తోందని కొనియాడారు. అంబేడ్కర్ వారసత్వాన్ని మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఇక దళిత విద్యార్థులకు మరిన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎంను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. దేశం గర్వించేలా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, చందూలాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు బాల్క సుమన్, పసునూరి దయాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
బుద్ధుడు..  అంబేడ్కర్... సచివాలయం
ఎంత ఖర్చయినా సరే అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌తో, ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుతో అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆషామాషీగా తాము ఈ స్థలాన్ని ఎంపిక చేయలేదని... ముందు బుద్ధుడు తర్వాత అంబేడ్కర్ విగ్రహం, ఆయన వెనుక సచివాలయం ఉండేలా చూశామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌లా ఉండేలా ఈ విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. ట్యాంక్‌బండ్‌కు ఈశాన్యంలో పాతబడ్డ అంబేడ్కర్ భవన్ స్థానంలో 15 అంతస్తులతో అంబేడ్కర్ టవర్స్ నిర్మిస్తామని... దళిత, గిరిజనుల అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు అక్కడ చేపడతామని తెలిపారు. బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌కు స్థలం కేటాయించడంతో పాటు రూ.10 కోట్లు కేటాయించామన్నారు.
 
 
 పెద్ద ఎత్తున భూ పంపిణీ
 అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తామని సీఎం చెప్పారు. ప్రతి నెలా ఒక కార్యక్రమం చేపడతామని, దళితులకు మూడెకరాల భూపంపిణీని ఒక నెలలో పెద్ద ఎత్తున చేపడతామని చెప్పారు.. పేదల ఆత్మగౌరవం పెంచాలని అంబేడ్కర్ కలలుగన్నారని, అదే బాటలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామని, ఈ ఏడాది 2.60లక్షల ఇళ్ల నిర్మాణం చేయబోతున్నామని, వాటిని వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
 
అంబేడ్కర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు
అంబేడ్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘అంబేడ్కర్‌కు తెలంగాణ సమాజం ఎంతో రుణపడి ఉంది. ఆయన తెచ్చిన చట్టంతోనే ఇవాళ తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీలుస్తోంది. రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కేంద్రం దగ్గరే ఉండాలని వాదించింది అంబేడ్కర్ ఒక్కరే. రాష్ట్రాల్లో బలవంతుల గుప్పిట్లో బలహీనులు నలిగిపోకుండా కేంద్రాన్ని ఆశ్రయించేందుకు వీలుగానే అంబేడ్కర్ ఈ సూచన చేశారు. రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కేంద్రం దగ్గర ఉండాలని చట్టం చేయడం వల్లే తెలంగాణ సిద్ధించింది. అంబేడ్కర్ దయ వల్లే మనం దోపిడీ నుంచి విముక్తి పొందాం.. ఆయనకు ఎంత గొప్పగా నివాళులర్పించినా తక్కువే..’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement