గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ

KCR meeting with the Governor - Sakshi

శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం

అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశం

కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నరసింహన్‌

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాత్రి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ వచ్చిన కేసీఆర్‌.. నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. అనంతరం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. వారం రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలను, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ వివరాలను ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఇక మార్చి 12 నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపైనా వారు చర్చించినట్లు సమాచారం.

అయితే శనివారం సీఎం కేసీఆర్‌ జన్మదినం. కానీ గవర్నర్‌ నరసింహన్‌ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై వెళుతున్నారు. దీంతో కేసీఆర్‌ శుక్రవారం రాత్రే గవర్నర్‌ను కలిశారని.. నరసింహన్‌ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. అంతకుమించి భేటీకి ప్రాధాన్యత లేదని పేర్కొన్నాయి. గవర్నర్‌ తిరిగి ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంటారని వెల్లడించాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top