‘సాక్షి’కి ఆంక్షలపై జోక్యం చేసుకోండి | journalists unions complaints to press council to remove restrictions on sakshi | Sakshi
Sakshi News home page

‘సాక్షి’కి ఆంక్షలపై జోక్యం చేసుకోండి

Sep 21 2014 3:51 AM | Updated on Aug 20 2018 8:20 PM

ఏపీ సీఎం నారా చంద్రబాబు నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానల్, నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానల్‌ను అనుమతించకపోవడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తక్షణమే..

ప్రెస్ కౌన్సిల్‌కు ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ, టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి
 
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానల్, నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానల్‌ను అనుమతించకపోవడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తక్షణమే జోక్యం చేసుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), దాని అనుబంధ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) శనివారం వి జ్ఞప్తి చేశాయి. సీఎం అధికారిక విలేకరుల సమావేశాలకు అనుమతించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ప్రెస్‌కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మా ర్గండేయ కట్జూను కోరాయి.
 
 రాష్ట్ర సీఎం నిర్వహించే విలేకరుల సమావేశాలకు ఈ మీడి యాసంస్థలను అనుమతించకపోవడం ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించడమే అవుతుందని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు డి. సోమసుందర్, ఐవీ సుబ్బారావు, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. శేఖర్, విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా సభ్యులు అమరనాథ్ చెప్పారు. ఈ నాలు గు మీడియా సంస్థల పట్ల అనుసరిస్తున్న వివక్ష రాజ్యాంగం కల్పిస్తున్న పత్రిక, మీడియా స్వేచ్ఛ ను ఉల్లఘించడమే అవుతుందన్నారు.
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠకులపరంగా సాక్షి దినపత్రిక రెండో స్థానంలో ఉందని, తెలంగాణలో నమస్తే తెలంగాణ ముఖ్యమైన పత్రికల్లో ఒకటని గుర్తుచేశారు. వీటిపై ఆంక్షలు విధించడమంటే ప్రభుత్వ సమాచారం ప్రజలకు తెలియకుండా అడ్డుకోవడం కిందకే వస్తుందని పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడుగా చంద్రబాబు గతం లో తన విలేకరుల సమావేశాలకు అనుమతించకపోవడంపై సాక్షి యజమాన్యం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే ఫిర్యాదు చేసిందని, అది పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నాలుగు మీడియా సంస్థలపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేసి, ఆయా సంస్థల విలేకరులను సమావేశాల్లో  పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement