‘సాగునీటి’ పరుగులు | Irrigation projects works going rapidly | Sakshi
Sakshi News home page

‘సాగునీటి’ పరుగులు

Jun 2 2017 12:57 AM | Updated on Sep 5 2017 12:34 PM

‘సాగునీటి’ పరుగులు

‘సాగునీటి’ పరుగులు

రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండేళ్లు సాగునీటి విషయంగా కొంత ఇబ్బంది ఎదురైనా..

- ఏడాదికాలంగా అందివస్తున్న ఫలాలు 
శరవేగంగా ప్రాజెక్టుల పనులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండేళ్లు సాగునీటి విషయంగా కొంత ఇబ్బంది ఎదురైనా.. గత ఏడాది కాలంగా మాత్రం బాగా కలిసొచ్చింది. నిర్మాణంలోని ప్రాజెక్టుల కింద పాక్షికంగా ఆయకట్టు వృద్ధిలోకి రావడం, గతేడాది చివర్లో కురిసిన వర్షాలకు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాం సాగర్‌ వంటి ప్రాజెక్టులు నిండడం సాగునీటి రంగానికి కొత్త ఊపిరిలూదింది. మిషన్‌ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువులన్నీ జలకళను సంతరించు కోవడంతో రబీ సాగు రికార్డు స్థాయిలో పెరిగింది. అయితే భూసేకరణ సమస్యల కారణంగా పలు ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరుగుతోంది. పొరుగు రాష్ట్రంతో జల జగడాలు కొంత తగ్గినా ఇబ్బందులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.  
 
నిర్మాణంలో ఉన్న వాటికే ప్రాధాన్యం 
కేసీఆర్‌ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకన్నా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే ప్రాధాన్యమిస్తోంది. గత మూడేళ్లుగా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడంతోపాటు వేగంగా పనుల పూర్తికి చర్యలు చేపట్టింది. పాలమూ రు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల కింద కొత్తగా 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించారు. 350 చెరువులు నింపారు. మెదక్‌ జిల్లా సింగూరు కాలువలను పూర్తి చేసి 30 వేల ఎకరాలకు నీరందించారు. కరీంనగర్‌లో ఎల్లంపల్లి ఎత్తిపోతల నుంచి 25వేల ఎకరాలు, చెరువులు నింపి మరో 37,000ఎకరాలను స్థిరీకరించారు.

ఎస్సారెస్పీ కాలువలు తవ్విన తరువాత ప్రత్యేకమైన డ్రైవ్‌ చేపట్టి మొదటిసారిగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు నీటిని తరలించి.. వందలాది చెరువులు నింపారు. ఖమ్మం జిల్లాలో 11 నెలల రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి చెరువులను నింపడంతో 6 వేల ఎకరాలకు సాగునీరు అందించగలిగారు. ఈ ప్రాజెక్టులో మిగతా పనులను వేగంగా పూర్తిచేసి ఈ ఖరీఫ్‌లోనే 58,958 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్‌ జిల్లాలో గత పదేళ్లుగా భూసేకరణ కారణంగా నిలిచిపోయిన 57 చెరువు పనులను ఈ సారి పూర్తి చేయగలిగారు.
 
కొలిక్కి వచ్చిన రీడిజైనింగ్‌
కాళేశ్వరం, ప్రాణహిత, తుపాకులగూడెం, దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, డిండి ఎత్తిపోతల పథకాల్లో కేసీఆర్‌ సర్కారు చేపట్టిన రీడిజైనింగ్‌ కొలిక్కి వచ్చింది. కొత్తగా చేపట్టిన వాటిలో కాళేశ్వరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి నీటిని తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మల్లన్నసాగర్‌తోపాటు దానికింద ఉన్న రిజర్వాయర్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మొదలైనా.. ఆ ప్రాజెక్టుకు కేసుల బెడద వెంటాడుతోంది.   

Advertisement
 
Advertisement
Advertisement