ఏపీఎస్‌ఎఫ్‌సీకి భూ కేటాయింపులపై యథాతథ స్థితి | high court said telangana to counter for APSFC issue | Sakshi
Sakshi News home page

ఏపీఎస్‌ఎఫ్‌సీకి భూ కేటాయింపులపై యథాతథ స్థితి

Nov 13 2015 2:49 AM | Updated on Aug 31 2018 8:24 PM

ఏపీఎస్‌ఎఫ్‌సీకి భూ కేటాయింపులపై యథాతథ స్థితి - Sakshi

ఏపీఎస్‌ఎఫ్‌సీకి భూ కేటాయింపులపై యథాతథ స్థితి

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎఫ్‌సీ)కు కేటాయించిన భూముల...

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఆదేశం
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారుకు స్పష్టీకరణ

 
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎఫ్‌సీ)కు కేటాయించిన భూముల విషయంలో యథాతథ స్థితిని(స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు గురువారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ భూ కేటాయింపులను రద్దు చేయడంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఏపీఎస్‌ఎఫ్‌సీకి గాజులరామారం వద్ద 271.39 ఎకరాలను కేటాయించింది.
 
ఈ కేటాయింపులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గత నెల 29న ఉత్తర్వులిచ్చింది. ఈ రద్దును సవాలు చేస్తూ ఏపీఎస్‌ఎఫ్‌సీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యాన్ని గురువారం ధర్మాసనం విచారించింది. ఏపీఎస్‌ఎఫ్‌సీ తరఫున ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ కేటాయింపులను రద్దు చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు. అనంతరం తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. రూ.కోట్ల విలువైన భూమిని ఏపీఎస్‌ఎఫ్‌సీ పరిరక్షించడం లేదని, ఆ భూమిని కాపాడేందుకు కేటాయింపులను రద్దు చేశామని తెలిపారు. తెలంగాణ భూభాగంలో ఉన్న భూమిపై తమకు చట్ట ప్రకారం హక్కులున్నాయని పేర్కొన్నారు. గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement