గోల్కొండ బోనాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి విగ్రహ ఊరేగింపు, పోతరాజుల ప్రదర్శన, డప్పు వాయిద్యాలు, ఆటపాటలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్త జనసందోహం నడుమ గోల్కొండ కోటపైన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు.
హైదరాబాద్ : గోల్కొండ బోనాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి విగ్రహ ఊరేగింపు, పోతరాజుల ప్రదర్శన, డప్పు వాయిద్యాలు, ఆటపాటలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్త జనసందోహం నడుమ గోల్కొండ కోటపైన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. మరోవైపు సర్వత్రా మతసామరస్యం వెల్లివిరిసింది. రంజాన్ వేడుకలతోపాటు, బోనాల ఉత్సవాల్లోనూ అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వేడుకలు సాయంత్రం 6 గంటలకు అమ్మవారు కోటపైకి చేరుకోవడం వరకు కొనసాగాయి. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ వేడుకల్లో పాల్గొన్నారు. జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ఒడి బియ్యం తదితర ప్రభుత్వ లాంఛనాలన్నింటినీ సమర్పించారు.